అమరావతి: ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గ వైసిపి రాజకీయం రసవత్తరంగా మారింది. భార్యాభర్తలు ఇద్దరూ ఏదో ఒక పార్టీనే ఎంపిక చేసుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి జగన్ చెప్పారన్న వార్త బయటకు వచ్చిన తర్వాత అందరి దృష్టీ పరుచూరుపైనే కేంద్రీకృతం అయింది. బిజెపిలో ఉన్న దగ్గుబాటి భార్య పురందేశ్వరి వైసిపిలో చేరతారా లేక ఆయనే మళ్లీ బిజెపి తీర్ధం పుచ్చుకుంటారా అన్న ఊహాగానాలు నడుస్తున్నాయి.
గత ఎన్నికలకు ముందు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ వైసిపిలో చేరారు. వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి బిజెపిలోనే కొనసాగుతూ వచ్చారు. హితేష్ను పర్చూరు నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని భావించినా విదేశీ పౌరసత్వ సమస్యతో ఆయన పోటీ చేయడానికి వీలుకాకపోవడంతో వెంకటేశ్వరరావు పోటీ చేశారు.ఎన్నికల ముందు వరకూ వైసిపిలో క్రియాశీలకంగా ఉన్న నాయకుడు రావి రామనాధం దగ్గుబాటి పార్టీలో చేరికతో మనస్థాపానికి గురై తన అనుచరులతో కలిసి టిడిపిలో చేరిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో దగ్గుబాటి పరాజయం పాలయ్యారు. ఎన్నికల అనంతరం నుండీలు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతదగ్గుబాటి నిర్వహిస్తుండగా పార్టీ వీడి వెళ్లిన రావి రామనాధం తిరిగి వైసిపిలో చేరడంతో నియోజకవర్గంలో రెండు గ్రూపులు తయారయ్యాయి.వైసిపి ఇన్చార్జి బాధ్యతల నుండి దగ్గుబాటిని తప్పించి రావి రామనాధం లేదా గొట్టిపాటి భరత్లలో ఎవరో ఒకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారనని కూడా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం దగ్గుబాటి అనుచరులు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. పార్టీ ఇన్చార్జిగా దగ్గుబాటినే కొనసాగించాలని లేదంటే ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్కు బాధ్యతలు అప్పగించాలని కోరారు. దగ్గుబాటి దంపతులు చెరో పార్టీలో ఉండటం సరికాదని సిఎం జగన్ అభిప్రాయంగా ఉన్నట్లు మంత్రి బాలినేని కార్యకర్తలకు చెప్పినట్లు తెలుస్తోంది. పురందేశ్వరి వైసిపిలోకి వస్తే సాదరంగా ఆహ్వానించడంతో పాటు పార్టీలో సముచిత స్థానం ఇచ్చి గౌరవించడానికి కూడా జగన్ సిద్ధంగా ఉన్నారని బాలినేని కార్యకర్తలతో అన్నట్లు తెలుస్తోంది. వైసిపి నుండి వచ్చిన ఈ ప్రతిపాదనతో దగ్గుబాటి దంపతులు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిజెపిలో క్రియాశీలకంగా ఉన్న పురందేశ్వరి తన భర్త, కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసిపిలో చేరతారా లేక భర్త, కుమారుడినే బిజెపిలోకి తీసుకువెళతారా అనేది ఆసక్తికరంగా మారింది.