లక్నో: ఉత్తరప్రదేశ్ లోని మహాకూటమికి అప్పుడే బీటలు వారుతున్నాయి. ముందే సమాజ్ వాదీ పార్టీ – బహుజన సమాజ్ పార్టీ కూటమిలో కాంగ్రెస్ చేరలేదు. ఇప్పుడు ఆ కూటమిలో భాగస్వామి అయిన నిషాద్ పార్టీ కూడా దాంట్లోంచి బయటకు వచ్చేసింది. మహారాజ్ గంజ్ స్థానం నుంచి తన పార్టీ గుర్తు మీద పార్టీ అధ్యక్షుడిని పోటీ చేయడానికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ పార్టీ బయటకు వచ్చేసింది. నిషాద్ (నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్) పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, ఆయన కొడుకు ప్రవీణ్ నిషాద్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. ప్రవీణ్ ప్రస్తుతం గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్నారు. గత ఉప ఎన్నికలలో ప్రతిష్ఠాత్మకమైన గోరఖ్ పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థిని ఓడించి ఆయన గెలిచారు.
అప్పట్లో ప్రవీణ్ సమాజ్ వాదీ టికెట్ మీద పోటీ చేసి, మూడు దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న గోరఖ్ పూర్ ను సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికలలో నిషాద్ పార్టీ కీలకపాత్ర పోషించింది. బద్ధశత్రువులుగా ఉన్న మాయావతి, అఖిలేష్ లను దగ్గరకు చేర్చి ప్రతిపక్ష ఐక్యత సాధించడంలో సంజయ్ నిషాద్ కీలకంగా వ్యవహరించారు. అలాంటిది ఇప్పుడు వాళ్లు బీజేపీ చెంతకు వెళ్తుండటంతో మహాకూటమి నేతలు షాకయ్యారు. బ్యానర్లు, పోస్టర్లలో ఎక్కడా తమ పార్టీ గుర్తు గానీ, నాయకుల ఫొటోలు గానీ లేవని సంజయ్ మండిపడ్డారు.