రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసిన హైకోర్టు విభజన రేపటి నుంచీ అమలులోకి వస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచీ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పని చేయడం ప్రారంభిస్తుంది. ‘మా హైకోర్టు మాకు కావాలి’ అంటూ ఆందోళన చేసిన తెలంగాణా వారికి ఆ రోజు నుంచీ హైదరాబాద్ నగరంలో మూసీ నది ఒడ్డున ఉన్న హైకోర్టు భవనం సొంతమవుతుంది. ఇక్కడ విజయవాడలో హైకోర్టుకు తాత్కాలిక భవనాలు సిద్ధం చేసే పనిలో అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. మరో పక్క హైదరాబాద్ నుంచి తరలించాల్సిన ఫైళ్లు అన్నీ ఏరి సర్దడం అక్కడి సిబ్బందికి తలకు మించిన భారంగా పరిణమించింది.
హైకోర్టు విభజన వ్యవహారం ఇంత కంగాళీగా ఎందుకు మారింది. ఇంత హడావిడిగా తరలివెళ్లమంటే ఎలా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత 40 రోజుల వ్యవధి ఉంది కదా ఏం చేస్తున్నారని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. ఇద్దరిలో ఎవరి వాదన సరైనది?
జనవరి ఒకటి లోపు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత 40 రోజుల వ్యవధి ఉన్న మాట వాస్తవమే. అయితే నాలుగు పని దినాల వ్యవధిలో తరలివెళ్లాల్సిందిగా కేంద్రం ఆదేశిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకోలేదు. డిసెంబర్ 26 రాత్రి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మిగిలింది నాలుగు పని దినాలే. గతంలో హైకోర్టుల విభజన జరిగినపుడు కొత్తచోట ఏర్పాటు కావాల్సిన హైకోర్టుకు తగినంత వ్యవధి ఇచ్చారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని ఆశించారు. సంప్రదాయం ప్రకారం ఎంత వ్యవధి కావాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర న్యాయశాఖ అడుగుతుంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.బి. రాధాకృష్ణన్ని ఈ విషయంలో సంప్రదించనే లేదు.
న్యాయశాఖ వర్గాలు ముందు నుంచీ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయనీ, అయితే చివరి నిముషంలో వ్యవధి ఎంత కావాలో అడగకుండానే నోటిఫికేషన్ ఇచ్చారనీ తెలిసింది. మోదీ సర్కారు చంద్రబాబుపై కక్ష సాధించే పనిలో భాగంగానే ఇది కూడా జరిగిందని తెలుగు దేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వైఎస్ఆర్సిపి నేత వైఎస్ జగన్కు కేసుల విచారణ విషయంలో సహాయపడేందుకే ఇలా చేశారని చంద్రబాబు నేరుగానే విమర్శించారు.
ఇదంతా ఎలా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఒక తప్పు మాత్రం చేసింది. డిసెంబర్ 15 నాటికల్లా అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధమవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. నిర్మాణంలో ఉన్న తాత్కాలిక భవనం ఇప్పుడు చూసినాగానీ, అంత తప్పు అంచనాకు ఎలా వచ్చారో ఎంత తల బద్దలు కొట్టుకున్నా అర్ధం కాదు. ఆ తప్పు చేసినందుకు తాత్కాలిక భవనం నిర్మాణంలో ఉండగా మరో తాత్కాలిక భవనం కోసం వెదకాల్సి వచ్చింది.