(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
చైనాలో పుట్టుకొచ్చిన ‘కరోనా వైరస్’ క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాలో ఇప్పటి వరకూ 830 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 41 మంది చనిపోయారు. ఈ మేరకు చైనా ప్రభుత్వం ప్రకటించింది. వుహాన్ నగరంలోనే ఈ వైరస్ పుట్టుకొచ్చింది. హుబివ్ ప్రావిన్సులో మరో 15 మంది మృతిచెందారు. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా సుమారు 1287 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యూరోప్కు కూడా వైరస్ పాకింది. ఫ్రాన్స్లో కొత్తగా మూడు కేసులు నమోదు అయ్యాయి.
చైనాలోని మొత్తం పది నగరాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. అంతేకాదు, చైనా గ్రేట్ వాల్ను సైతం మూసివేశారు. లూనార్ క్యాలెండర్ ప్రకారం చైనా కొత్త సంవత్సరం జనవరి 25 కాగా, ఇందుకు వారం రోజులు సెలవులు ఇస్తారు. అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకలను చైనీయులు జరుపుకుంటారు. కానీ, ఈసారి కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేడుకలను రద్దుచేశారు.
మరోవైపు చైనాలోని వుహాన్ నగరంలో కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి పడకల సామర్థ్యం గల ఆస్పత్రిని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ను నియంత్రించే చర్యల్లో భాగంగా.. ఇప్పటికే ఈ వైరస్ సోకిన వారికి సేవలు అందించేందుకు ఈ ఆస్పత్రి నిర్మిస్తున్నారు. 2003లో కూడా సార్స్ వైరస్ సోకిన వారికి వైద్యం అందించేందుకు బీజింగ్లో ఇలాగే ఒక ఆస్పత్రిని నిర్మించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. వుహాన్ పరిసర ప్రాంతాల్లోని నగరాల్లో ప్రజారవాణా, విమానాశ్రయాలను మూసివేశారు. బయటవారు లోపలికి ప్రవేశించకుండా, అక్కడవారు బయటకు వెళ్లకుండా దిగ్బంధం చేశారు.
ఇదిలా ఉండగా చైనా, హాంకాంగ్ నుంచి భారత్కు వచ్చిన 12 మందికి కరోనా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. దీంతో వీరిని ఆస్పత్రిలో ఉంచి ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నారు. ఈ 12 మందిలో తొమ్మిది మంది కేరళలోని ఎర్నాకుళం, త్రిసూర్కు చెందినవారు కాగా, ఇద్దరు ముంబైవాసులు, ఒకరు హైదరాబాద్ పౌరుడు. శుక్రవారం(జనవరి 24) ముంబైకి ఇద్దరు, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన ఒక్కొక్కరి నుంచి నమూనాల సేకరించి పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అయితే, ఫలితాలు నెగెటివ్గా వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కొట్టాయంకి చెందిన ఓ మహిళకు తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను ఇంటి వద్దే ఉంచి.. వైద్యుల పర్యవేక్షిస్తున్నారు.
జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు ఈ కరోనా వైరస్ సాధారణ లక్షణాలు. దీనితో అవయవాలు విఫలం కావడం, న్యుమోనియా లేదా మరణానికి కూడా దారితీసే ప్రమాదముంది. అయితే, ఇప్పటి వరకు దీనికి ఎటువంటి వాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఈ వ్యాధి సోకినవారి నుంచి ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడటమే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా, దగ్గినా కూడా ఇది ఇతరులకు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ఈ వైరస్ను 1960ల్లో కనుగొన్నారు. ఇప్పటి వరకూ ఆరు రకాల కరోనా వైరస్లను గుర్తించారు. ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపించేవి. కానీ, తాజాగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.