అమరావతి: కృష్ణానది వరద ప్రభావం తగ్గడంతో ముంపు ప్రాంతాలలో క్రమేపీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కృష్ణానదికి పదేళ్ల తరువాత రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో గత కొద్ది రోజులుగా కృష్ణా, గుంటూరు జిల్లాలలోని నదీ పరివాహాక గ్రామాలు వణికిపోయాయి. లంకలతో పాటు పలు గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతి సౌకర్యాలను కల్పించారు. అధికార యంత్రాంగం ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టాన్ని నివారించారు. వందలాది ఎకరాలు ముంపునకు గురవ్వడంతో పంట నష్టం భారీగా వాటిల్లింది.
వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజి ఎగువ, దిగువ ప్రాంతాల్లో నీటి మట్టం నాలుగు నుండి ఎనిమిది అడుగుల మేర తగ్గిపోయింది. పొలాల్లో నీరు తగ్గడంతో రైతులు తమ పొలాలను బాగు చేసుకుంటున్నారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు నాలుగు అడుగుల మేర తగ్గింది. ఆయా ప్రాంతవాసులు పరిసరాలను శుభ్రం చేసుకుంటున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారు తమ ఇళ్లను పరిశీలించి మళ్లీ వెళుతున్నారు. మూడు రోజులుగా ఇళ్లు నీటిలో నానడంతో కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలం గాజుల్లంక, ఆవులవారిపాలెం, పెసర్లంక, చింతల్లంక, ఈవూరులంక, పెద్దలంక తదితర గ్రామాలకు రాకపోకలు సాగుతున్నాయి. వరద ముంపు కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం వల్ల వేలాది సర్వీస్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శించి పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు.