పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే…
సిఏఏపై ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. 48 గంటలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరిస్థితి పోలీసుల అదుపులో లేదు, ఆర్మీ రావాల్సిందే అంటూ సీఎం కేజ్రీవాల్ కోరారు. ఈ అల్లర్లు కారణంగా ఇప్పటి వరకు 20 మంది మరణించగా…, 150 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పోలీసులు, పౌరులు, నిరసనకారులు ఉన్నారు. నిన్న ఇదే సమయానికి కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాయిజల్… తదితరులు పోలీసు ఉన్నతాధికారులు, వివిధ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. కానీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఇప్పటికీ ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్నట్టుగా నీవురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. జన జీవనం స్తంభించింది. ఇళ్లకు, దుకాణాలకు, సముదాయాలకు, వాహనాలకు నిప్పు పెడుతున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకుంటున్నారు. పోలీసుల చేయి దాటినట్టే పరిస్థితి ఉంది. సూట్ అండ్ సైట్.. (కనిపిస్తే కాల్చేసే) ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఏ మాత్రం అదుపులోకి రాలేదు.
తాజాగా సీఎం కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే ఆర్మీ రావాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రికి రాస్తున్నట్టు చెప్పారు. దీనిపై కేంద్రం స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మరో వైపు అల్లర్లు జరుగుతున్న ప్రాంతం దేశంలోనే అత్యంత భద్రత ఉండాల్సిన ప్రదేశం కావడంతో కాస్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పీఎం నివాసం, పార్లమెంటు, రాష్ట్రపతి నివాసానికి ఈ ప్రదేశం కేవలం15 కిలోమీటర్లలోనే ఉంది. అందుకే ఏ క్షణాన ఏం జరుగుతుందో అంటూ భయాందోళనకు గురవుతున్నారు.
previous post
next post