పొలిటికల్ మిర్రర్
దేశ రాజధానిలో శాసనసభ ఎన్నికల వేడి మొదలయ్యింది. ఉత్తరభారతాన తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీకి ఢిల్లీలో శాసనసభ పీఠం కొరకరానికొయ్యగా మారింది. ఈ సారి ఎలాగైనా సామాన్యుడి పార్టీ (ఆప్)ని ఓడించి సీఎం కుర్చీపై కూర్చోవాలని యోచిస్తోంది బిజెపి. మరోవైపు కాంగ్రెస్ కూడా తమకు పట్టున్న పీఠాన్ని తిరిగి దక్కించుకోవాలని ప్రణాళికలు వేస్తుంది. ఓ వైపు సామాన్యుడి నుండి సీఎం గా ఎదిగిన ఆప్…, మరోవైపు ఆరేళ్లుగా దేశంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న బిజెపి, మరోవైపు కాంగ్రెస్… ఇలా ఢిల్లీ శాసనసభకి త్రిముఖపోరు మొదలయింది. నిన్నటితో నామినేషన్లు ఘట్టం ముగిసింది. ఇక ప్రచార హోరు, ప్రత్యక్ష పోరు మాత్రమే మిగిలి ఉంది. ఒకరిపై ఒకరు ఎత్తులు వేస్తూ సిద్ధమవుతున్నారు.
ఆప్…! సీఎం గ్యారెంటీ కార్డు…!
వరుసగా రెండో సారి కూడా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని కేజ్రీవాల్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. సామాన్యుడిగా వచ్చి రాజకీయ పార్టీని నడిపిస్తూనే, పాలనపై దృష్టి పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లకు తమపై భరోసా దక్కేలా ఆప్ ప్రణాళికలు వేసింది. రానున్న ఐదేళ్లలో తాము ఏం చేస్తామో తెలియజేస్తూ “సీఎం గ్యారెంటీ కార్డు”ని ప్రవేశ పెట్టనుంది. ఆప్ మ్యానిఫెస్టోలో ఇదే కీలక, కొత్త అంశంగా ఉంటుంది. సీఎం గా గెలిస్తే వచ్చే ఐదేళ్లలో ఎప్పుడు, ఏం చేస్తాము అనే విషయాలని వివరిస్తూ ఇంటింటికీ ఈ గ్యారెంటీ కార్డు ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో పాటు గడిచిన ఐదేళ్లలో అవినీతి రహిత పాలన, పథకాలను ఓటర్లలోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్ధించే ప్రణాళికలు వేసింది.
బిజెపి..! లోకసభ గెలుపు ఊపు…!
బీజేపీకి ఢిల్లీ సీఎం పీఠం అందని ద్రాక్షలా మిగిలింది. 2013లో కేవలం 4 స్థానాల వెనుకబడి అధికారం కోల్పోయింది. 2015లో సీఎం కుర్చీ అసలు దరిదాపులకి కూడా బిజెపి రాలేదు. కానీ 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఢిల్లీ శాసనసభ పరిధిలోని మొత్తం లోక్ సభ స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఇదే ఊపుతో ఈ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఓటర్ల విషయంలో ఎత్తులు వేస్తూ సామాజిక సమీకరణాలు, వర్గాల వారీగా అభ్యర్ధులని దించి తమ భాగస్వాములని వాడుకుంటుంది. గత ఎన్నికల్లో కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించిన బిజెపి ఈ సారి కెప్టెన్ లేకుండానే యుద్ధానికి వెళ్తుంది. సీఎం అభ్యర్థి ప్రకటించకుండానే నేరుగా రంగంలోకి దిగింది. అయితే కేజ్రీవాల్ పై పార్టీలో పట్టున్న సునీల్ యాదవ్ ని పోటీలోకి దించింది. కేంద్రం పథకాలు, మోడీ చరిష్మా, లోక్ సభ స్థానాలు గెలుపుతో బిజెపి కార్యకర్తల్లో జోష్ వంటివి ఈసారి బిజెపికి అనుకూలాంశాలు.
కాంగ్రెస్..! పూర్వవైభవం కోసం…!
ఢిల్లీలో కాంగ్రెస్ కి ఒకప్పుడు తిరుగులేదు. వరుసగా మూడుసార్లు ఆ పార్టీ అధికారంలోకి వచింది. 1998 నుండి 2013 వరకు పదిహేనేళ్ళు దివంగత షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి జననాడి పట్టగల పెద్దదిక్కు కరవయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్ ని కాంగ్రెస్ ఢీకొట్టాలి. గడిచిన ఎన్నికల్లో ఒక్కస్థానమూ కాంగ్రెస్ కి రాలేదు. ఇప్పుడు పెద్దగా ఆశలు లేకపోయినా భాగస్వామిగా ఉండగలమనే నమ్మకంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు.
గతంలో ఇలా…!
2013 తర్వాత ఢిల్లీ రాజకీయాల్లోకి సరికొత్త రాజకీయ శక్తిగా సామాన్య పార్టీ వచ్చింది. లోక్ పాల్ బిల్లుపై పోరాటంతో వెలుగులోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీపెట్టి సామాన్యుడి చీపురు గుర్తుతో సంచలనాలు సృష్టించారు. 2013 ఎన్నికల్లో 26 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ మద్దతుతో సీఎం పీఠం ఎక్కారు. కానీ తాను అనుకున్న లోక్ పాల్ బిల్లుపై ఇబ్బందులు వస్తుండడంతో 49 రోజులకే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 2015 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 3 గెలవగా, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కానీ ఈసారి మాత్రం చీపురుకి చుక్కలు చూపించే ప్రణాళికలతో బిజెపి రంగంలోకి దిగింది. కేజ్రీవాల్ నామినేషన్ సందర్భంగానే ఆసక్తికర పరిణామాలు జరిగాయి. గడువు ముగిసే చివరి నిమిషంలో ఆయన నామినేషన్ వేశారు. పైగా కేజ్రీవాల్ పై పోటీగా 175 మంది స్వతంత్ర అభ్యర్ధులు రంగంలోకి దిగారు. బిజెపి కూడా బలమైన అభ్యర్థిని దించి, చీలిక ఓట్ల ద్వారా గెలవాలని యుక్తులు వేస్తుంది. ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనుంది, 11న ఫలితాలు వస్తాయి.
శ్రీనివాస్ మానెం