ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన వ్యాపారి నరేంద్ర గెహ్లాట్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు నకుల్ సంగ్వాన్ ను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 24న ఢిల్లీలోని ద్వారా ప్రాంతంలో పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే..నరేంద్ర గెహ్లాట్ ను హత్య చేశారు. ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఢిల్లీలో ద్వారకా ప్రాంతంలో కారులో వెళ్తున్న నరేంద్ర గెహ్లాట్ అనే వ్యాపారిపై కాల్పులకు దుండగులు తెగబడ్డాడు. ప్రాణాలను కాపాడుకొనేందుకు వ్యాపారి కారు నుంచి బయటకు వచ్చి పరుగులు పెడుతున్నా ఆ దుండగుడు వదల్లేదు. మరో కారు మీదకు ఎక్కి మరీ కాల్పులు జరిపాడు. సినీ ఫక్కీలో వేటాడి..వేటాడి కాల్చి చంపేశాడు. దుండగుడు హెల్మెట్ పెట్టుకోవడంతో గుర్తుపెట్టడం కష్టంగా మారింది. ఈ ఘటన అనంతరం దేశరాజధానిలో భద్రత కరువైందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. దీంతో ఆ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
ద్వారాక డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆంటో అల్పోన్స్ తెలిపిన వివరాల ప్రకారం గత జూలైలో నకుల్ సంగ్వాన్, నరేంద్ర గెహ్లాట్ల మధ్య ఓ విషయంలో గోడవ జరిగింది. ఈ సందర్భంగా సంగ్వాన్ పై గెహ్లాట్ చేయి చేసుకున్నాడు. దీంతో నరేంద్ర గెహ్లాట్ ను హత్య చేసేందుకు సంగ్వాన్ పథకం రచించాడని పోలీసులు తెలిపారు. గత రెండు నెలలుగా గెహ్లాట్ ను చంపేందుకు ప్రయత్నించి విఫలమైయ్యాడని, మంగళవారం పక్క ప్రణాళికతో హత్య చేశాడని వివరించారు. నిందితుడు నకుల్ సంగ్వాన్ పై పలు కేసులు ఉన్నాయని తెలిపారు. గతేడాది ఓ హత్య కేసులో సంగ్వాన్ అరెస్ట్ అయ్యాడని తెలిపారు. గత జూన్ లో జైలు నుంచి విడుదలై మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.