న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జిల్లా కోర్టుల్లో న్యాయవాదుల సమ్మె కారణంగా ఢిల్లీ హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిటిషన్ ను పరిశీలించారు. అనంతరం చిదంబరం కస్టడీ పొడిగింపునకు అనుమతినిచ్చారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరంను సీబీఐ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు కస్టడీని పొడిగించడంతో ఈ నెల 27 వరకు ఈడీ చిదంబరంను విచారించనుంది. ఫలితంగా కస్టడీ ముగిసేంత వరకూ ఆయన తీహార్ జైలులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిజానికి ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరానికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. రెండున్నర లక్షల రూపాయల పూచీకత్తుపై సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు. దీంతో ఆయన కస్టడీలోనే కొనసాగుతున్నారు. ఈడీ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ కోసం చిదంబరం తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. సాధ్యం కావట్లేదు.