న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఎట్టకేలకు ఉరి తీత తేది ఖరారు అయింది. మార్చి మూడవ తేదీ ఉదయం ఆరు గంటలకు వారిని ఉరితీయాలని ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు సోమవారం కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ఉరి వాయిదా పడేలా దోషులు అనేక ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి జనవరి 22నే వీరిని ఉరితీయాల్సి ఉండగా, దోషుల్లో ఒకడైన ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ రూపంలో శిక్ష అమలుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటిన ఉరితీసేందుకు ఢిల్లీ కోర్టు రెండోసారి డెత్వారెంట్ జారీ చేసింది.
దీనికి రెండు రోజుల ముందు జనవరి 30న దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దోషులు నలుగురు అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు ఉరిశిక్షపై స్టే విధించాలని పిటిషన్ వేశారు. దీంతో ఉరిశిక్ష అమలుపై పటియాలా హౌస్ కోర్టు జనవరి 31న స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉరి అమలును వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలా రెండో సారి వాయిదా పడింది. దోషుల క్షమాబిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే.