పొలిటికల్ మిర్రర్
దేశ రాజధానిలో రాజకీయం రాజుకుంది…! నాయకుల వాగ్బాణాలు ఎదుటి వారిపైకి దూసుకెళ్తుంటే.., వాగ్ధానాలు జువ్వల్లాగా గాలిలో ఎగురుతున్నాయి. నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, హస్తిన ప్రజలు మాత్రం విభిన్న తీర్పు ఇస్తుంటారు. వారి తీర్పు ఏంటి? నాయకుల భవితవ్యం ఏంటి? చీపురు మళ్ళీ ఊడ్చేస్తుందా..? బిజెపి పాగా వేస్తుందా? హస్తం తమ హస్తవాసి చూపిస్తుందా అనేది తేలనుంది.
ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ కు మరో రోజు వ్యవధి మాత్రమే ఉంది. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 11 న ఫలితాలు రానున్నాయి. కొన్ని జాతీయ పత్రికలు, టైమ్స్ నౌ వంటి ప్రఖ్యాత సంస్థలు మళ్ళీ ఆప్ దే అధికారం అంటూ తమ అంచనాలను వెల్లడించాయి. మరి గత ఫలితాలు, ఈ ఎన్నికలపై పార్టీల అంచనాలు, అవకాశాలు పరిశీలిస్తే…!
ఢిల్లీలో ఓటర్ల నిర్ణయాలు సూటిగా ఉంటాయి. పరిపాలన నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. దీనికి గత ఎన్నికల ఫలితాలే నిదర్శనం. 1993 నుండి పరిశీలిస్తే… 1993 ఎన్నికల్లో బిజెపి 49 స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టింది. కానీ జనరంజక పాలన లేకపోవడంతో 1998 అధికారం కోల్పోయింది. 1998 లో 52 స్థానాలు, 2003 లో 47 .., 2008 లో 43 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ తన హవా చాటింది. ఈ మూడుసార్లు షీలా దీక్షిత్ తనదైన ముద్రతో పరిపాలన అందించారు. తర్వాత 2013 నుండి అధికారం కోసం పోరాడుతున్న బిజెపికి కేజ్రీవాల్ రూపంలో కొరకరాని కొయ్య వచ్చింది. దేశమంతటా హవా చాటుతున్న బిజెపి, దేశ రాజధానిలో మాత్రం సామాన్యుడి చేతిలో ఓడిపోతున్నది. అందుకే ఈ ఎన్నికలు బిజెపికి కీలకం. పౌరసత్వం సవరణ చట్టం పుణ్యమా అని ఈసారి కొత్తగా షాహీన్ బాగ్ చుట్టూ ఢిల్లీ రాజకీయం పరిభ్రమిస్తున్నది. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఉద్యమానికి షాహిద్ బాగ్ ప్రతీకగా మారింది. కాంగ్రెస్ ఈ శిబిరానికి, ధర్నాలకు మద్దతు తెలుపుతున్నది. బిజెపి దీనిని జాతి వ్యతిరేక ఉద్యమంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నది. కేజ్రీవాల్ సున్నిత అంశంగా పరిగణించి బంతిని బిజెపిపైకే నెట్టేస్తున్నారు.
వహ్వా కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి (2013 లో మొదటిసారి ఆయన 49 రోజులకే రాజీనామా చేశారు) అధికార పీఠం తమదే అనే ధీమాతో ఉన్నారు. ఐదేళ్లలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని నమ్మకంతో ఉన్నారు. మధ్య తరగతికి కనీస అవసరాలైన విద్య, వైద్యం విషయంలో తమ పాలన తీరుపై ప్రజల్లో సంతృప్తి ఉందని ఆ పార్టీ నమ్ముతుంది. పాఠశాల ఆధునికీకరణ, వైద్య సేవలు విస్తరించడం తమకు కలిసి వస్తాయని లెక్కలు వేస్తున్నది. మహిళల భద్రతకు పెద్దపీట వేయడం, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం, ఉద్యోగుల్లో తమపై నమ్మకం ఇలా… అన్ని సానుకూల అంశాలను విశ్లేషించుకుంటున్నది. కనీసం 55 నుండి 62 స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ కీలక నేత, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్తున్నారు. ప్రచారం సందర్భంగానూ కేజ్రీవాల్ భిన్నంగా వెళ్లారు. బిజెపి వాళ్ళు తనను ఉగ్రవాదితో పోలిస్తే… `నేను ఉగ్రవాదిని అయితే ఓటు కమలానికి వేయండి. ఢిల్లీ బిడ్డగా, మీ సంక్షేమం కోరేవాడ్ని అనుకుంటే చీపురు బటన్ నొక్కండి` అంటూ తిప్పికొట్టారు. బిజెపి అభ్యర్థుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఎవరికీ లేదు అంటూ చురకలు పెట్టుకొచ్చారు. తన అయిదేళ్ల విజయాలు, రానున్న అయిదేళ్ల ప్రణాళికలు వివరిస్తూ ప్రచారం చేసారు.
నాయకుడు లేని ప్రయాణం…!
2013 లో హర్ష వర్ధన్ (ప్రస్తుత కేంద్ర శాస్త్ర, సాంకేతిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మంత్రి).., 2015 లో కిరణ్ బేడీ… ముఖ్యమంత్రి అభ్యర్థులుగా బిజెపి రంగంలోకి దిగింది. 2013 లో 31 స్థానాలు, 2015 లో ౩ స్థానాలు గెలిచింది. ఈ సారి అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగింది. దేశం మొత్తం…, ముఖ్యంగా ఉత్తరాదిన వేళ్లూనుకుని పాగా వేసిన బిజెపికి ఢిల్లీ శాసనసభలో ఆధిక్యత లభించకపోవడం మింగుడుపడడం లేదు. అందుకే ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా అన్నీ తాముగా ప్రచారం చేస్తున్నారు. బిజెపి అధ్యక్షుడు నడ్డా తెర వెనుక చక్రం నడుపుతున్నారు. ఈ సారి తాము అధికారం చేపట్టకుంటే కేజ్రీవాల్ తమకు అడ్డుగోడగా మారతాడని, అతనిని ఎలా అయినా ఓడించాలని లక్ష్యంతో బరిలోకి దిగింది. సామ ధాన, దండోపాయాలు, రాజకీయ అస్త్రాలను దించుతూ… జాతీయ వాదంతో తాము తీసుకున్న నిర్ణయాల (సీఏఏ, ఎన్ఆర్ సి) ఉద్దేశాలను వివరిస్తున్నది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం, ఢిల్లీలో కొందరు కీలక నాయకులు సీట్లు లభించక అలక పూనడం, కొందరు కార్పొరేటర్లు పార్టీకి సహకరించకపోవడం పార్టీకి తలనొప్పులుగా మారాయి. ఎలాగయినా ఈ సారి తమకు 45 స్థానాలకు తగ్గవు అంటూ బిజెపి నాయకులు లెక్కలు వేస్తున్నారు.
హస్త వాసి మారాలని…!
పాపం కాంగ్రెస్ … 1998 నుండి 2003 వరకు పదిహేనేళ్ళు ఢిల్లీలో చక్రం తిప్పిన హస్తం ఇప్పుడు అక్కడ తమ లాఘవం కోల్పోయింది. కనీసం చిరునామా లేక చతికిలపడింది. 2003 లో 8 స్థానాలు గెలిచినా, 2015 లో ఒక్క స్థానమూ రాలేదు. ఇప్పుడు ఆ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. పూర్వ వైభవం వస్తుందని, 40 స్థానాలకు పైగా వస్తాయని పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ… కనీసం 15 స్థానాలు గెలుచుకుంటే తమ ఉనికిని కాపాడుకుని, అధికారానికి కీలకంగా మారవచ్చని అంతర్గత లెక్కలు వేస్తున్నది. అందుకే రాహుల్ సహా .., పార్టీ కీలక నాయకులు రంగంలోకి దిగారు. ఈ పార్టీ బిజెపి విధానాలను ఎండగడుతూ కేజ్రీవాల్ పాలననూ, ఆయన నెరవేర్చని హామీలని ఓటర్లకు గుర్తుచేస్తున్నది. ఇలా ఢిల్లీ వీధుల్లో గత నెల రోజులుగా మార్మోగిన రాజకీయ మైకులు నేటితో మూగబోనున్నాయి. ఈ నెల 11 న మళ్ళీ గెలుపు రాగాలతో ఏదో ఒక పార్టీ రాగాలాపన రానుంది. నాటి వరకు వేచి చూడడమే దేశ రాజకీయ ఆసక్తిపరుల పని.
శ్రీనివాస్ మానెం