న్యూఢిల్లీ: కొరకరాని కొయ్యగా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓటమి రుచి చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది. బిజెపి గత ఎన్నికలలో కేవలం మూడు సీట్లకు పరిమితమయింది. వచ్చే నెలలో జరగనునున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 40 మంది స్టార్ కాంపైనర్లను రంగంలోకి దించుతున్నది.
ఈ స్టార్ కాంపైనర్లలో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇంకా సీనియిర్ నాయకులు ఉన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, రాజనాధ్ సింగ్, హర్ష వర్ధన్, విజయ్ గోయెల్, నితిన్ గడ్కరీ, పార్టీ నూతన సారధి జెపి నడ్డా ప్రచారం చేపట్టనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్, మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ అర్జున్ ముండా ప్రముఖులు.
బిజెపి తరపున ప్రచారం చేయనున్న వారిలో ఎక్కువ మంది ఢిల్లీ వెలుపలి వారు. ఈ అంశాన్ని ఆప్ నాయకత్వం వాడుకునే అవకాశం ఉంది. ఈసారి బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధిని కూడా ప్రకటించలేదు. ఇటీవల కేజ్రీవాల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేజ్రీవాల్పై బిజెపి చివరి నిముషంలో సునీల్ యాదవ్ను దించింది. ఈ పోటీకి సునీల్ యాదవ్ సిద్ధంగా లేరు. పరాజయం తన రాజకీయ జీవితానికి చరమగీతం అవుతుందని ఆయన భయపడుతున్నారు. అయితే బిజెపి నాయకత్వం ఆయనను మార్చేందుకు ససేమిరా అంది.