(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోషిస్తుండగా కేంద్రంలో సర్కారు నడుపుతున్న బిజెపి మాత్రం వాటిని కొట్టి పారేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక సమావేశం నిర్వహించారు. సీనియర్ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి లేఖి ఆ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు అని వ్యాఖ్యానించారు. ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితమైన అని అర్ధం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని ఆమె మాటలకు అర్ధం. మా వోటర్లు ఆలస్యంగా బయటకు వచ్చారు. కాబట్టి విజయం మాదే అని ఆమె అన్నారు.
అయితే పోలింగ్ ముందు బిజెపి నిర్ణయించిన వ్యూహంలో ఆలస్యంగా వోటు చేయించడం అన్న మాట లేదు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్లి ఉదయం 10:30 లోపు వోటు చేయాలని హోంమంత్రి అమిత్ షా బుధవారం ఢిల్లీ వోటర్లకు పిలుపునిచ్చారు. మీ నిర్ణయం నాకు తెలుసు. ఫిబ్రవరి 11వ తేదీ వెలువడే ఫలితాలను చూసి ఆందరూ ఆశ్చర్యపోక తప్పదు అని ఆయన అన్నారు.
70 సీట్ల ఢిల్లీ శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 36 మంది శాసనసభ్యుల బలం ఉండాలి. శనివారం పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని మెజారిటీ చూపించాయి. కనీసం అర డజను అంచనాలు వెలువడగా ఆప్కు సగటున 56 సీట్లు రావచ్చని అవి సూచిస్తున్నాయి. టైమ్స్ నౌ అత్యల్పంగా 47 సీట్లు రావచ్చని ప్రకటించగా, ఇండియా టుడే అత్యధికంగా 59 – 68 సీట్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నది.