ఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు కొనసాగించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్లో పెంచిన పింఛన్లు, పసుపు – కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై జన చైతన్య వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు వివరిస్తూ అందుకు సంబంధంచిన ఆదేశాలను అందజేశారు.
అలాగే పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు పరిశీలించిన కోర్టు పిటిషనర్ తరుపు వాదనలను తోసిపుచ్చింది. ఈ విషయంలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ పథకాలు అమలులో ఉన్నందున లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు పంపడం ఎన్నికల సంఘం నియమావళి పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది.
అలాగే, ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందనీ, ప్రభుత్వ పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందనీ పిటిషనర్ను ప్రశ్నించింది. ప్రతిసారి ఇలాంటి వాటిని కోర్టుల దృష్టికి తీసుకొచ్చి విలువైన సమాయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఈ వ్యవహారంపైనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు కాగా న్యాయమూర్తి పిటిషన్ను తిరస్కరించారు. ఢిల్లీ హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉంది కనుక పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు.