న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్కు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్కు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కండిషన్ పెట్టింది. మనీలాండరింగ్ కేసులో సెప్టెంబర్ 3న డీకే శివకుమార్కు ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పన్నులను ఎగ్గొట్టారని, కోట్లాది రూపాయల లావాదేవీలను అక్రమంగా నిర్వహించారని ఈడీ ఆరోపిస్తోంది. సుమారు 50 రోజుల పాటు డీకే. శివకుమార్ తీహార్ జైలులో విచాణ ఖైదీగా శిక్ష అనుభవించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం ఉదయం తీహార్ జైలుకు వెళ్లి శివకుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో డీకే సురేశ్ మాట్లాడుతూ, శివకుమార్ వెంట పార్టీ మొత్తం ఉంటుందని సోనియా తెలిపారని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసును పెట్టారని… ఇతర కాంగ్రెస్ నేతలను కూడా టార్గెట్ చేశారని… బీజేపీతో మనం పోరాటం చేసి, బయటపడాలని సోనియా చెప్పారని తెలిపారు. మరోవైపు, శివకుమార్ కు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.