న్యూఢిల్లీ: కొత్త మోటర్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించని వాహనదారులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు భారీ చలాన్ విధించడంతో.. తాను కట్టలేనుంటూ ఏకంగా తన బైక్ను నడిరోడ్డుపై తగలబెట్టేశాడు. ఢిల్లీలోని షేక్ సరాయ్ లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ బైక్ను ఆపి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారని ఫైన్ విధించారు. రకరకాల పెనాల్టీలతో ఆ బైక్పై రూ.16 వేల జరిమానా విధించారు. దీంతో షాక్ తిన్న వాహనదారుడు.. చలాన్ కట్టడం కంటే బైక్ బదులు బస్సులో పోవడం బెటరేమోనని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అయితే, కొత్త రూల్స్ ప్రకారం చలాన్ చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. దీంతో నడి రోడ్డుపై తన బైక్ను పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే, తాగిన మైకంలోనే ఆ వాహనదారుడు అలా వ్యవహరించాడని పోలీసులు చెబుతున్నారు.
ఇదిఇలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానా విధిస్తున్నారు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో ఓ ఆటోడ్రైవర్కి రూ.32,500 జరిమానా పడింది. ఆటోకి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,డ్రైవింగ్ లైసెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్,ఇన్సూరెన్స్ పేపర్స్ లేకపోవడంతో అతనికి భారీ మొత్తంలో జరిమానా విధించారు. ఇక ఇదే గురుగ్రామ్లో మదన్ అనే మరో వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు రూ.23 వేలు జరిమానా పడింది. అయితే అతను నడుపుతున్న బండి రూ.15 వేలకు మించి ఉండదు. అతనికి పడ్డ జరిమానా అంతకంటే ఎక్కువ కావడంతో బండిని పోలీసులకే అప్పగించిన వెళ్లిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు భారీగా వడ్డిస్తున్న జరిమానాలతో ప్రజలు ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
https://youtu.be/nVu8drM5rG4