ఘజియాబాద్ ఆలయంలో కాల్పులు
వివాహేతర సంబంధం కోసం ఘాతుకం
ఘజియాబాద్: దంపతులను గుడిలో కాల్చిచంపిన ఢిల్లీ పోలీసు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. తనతో వివాహేతర సంబంధం కొనసాగించనందుకు ఆగ్రహంతో అతడు వారిద్దరినీ ఘజియాబాద్ లోని ఒక ఆలయంలో కాల్చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ ట్రాఫిక్ విభాగంలో ఏఎస్ఐగా దినేశ్ పనిచేస్తున్నడు. ప్రీతి (32), ఆమెకు కాబోయే భర్త సురేంద్ర (26)లను కాల్చిచంపిన కేసులో దినేశ్, అతడి అనుచరుడు పింటూను అరెస్టు చేశారు. హిండన్ నది సమీపంలోని సాయి ఉప్ వన్ లోని ఆలయంలో ఈ హత్యలు జరిగాయి.
ప్రీతి తండ్రి ప్రమోద్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ తెలిపారు. ప్రీతితో దినేశ్ కు సంబంధం ఉన్నట్లు తెలియడంతో అతడినే ప్రధాన నిందితుడిగా భావించారు. తర్వాత సీసీటీవీ ఫుటేజిని చూసి, ఆ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ నిఘా పెట్టారు. వారం రోజుల క్రితం ఫోన్ నంబర్ మార్చేసిన ప్రీతి.. ఆ తర్వాతి నుంచి దినేశ్ ను కలవడం మానేసింది. ఆమె సురేంద్రను పెళ్లి చేసుకుంటుందని తెలియడంతో వారిని చంపాలని దినేశ్ కుట్ర పన్నాడు. మార్చి 25న సాయిబాబా ఆలయానికి వెళ్తుండగా వాళ్లను ఫాలో అయ్యారు. ఆలయం నుంచి బయటకు రాగానే వాళ్లతో దినేశ్ గొడవ పడ్డాడు. కోపంలో ఇద్దరినీ తన సర్వీసు పిస్టల్ తో కాల్చేశాడు. అతడి వద్ద నుంచి 9ఎంఎం సర్వీస్ పిస్టల్, 3 లైవ్ కార్ట్ర్రిడ్జులు, నేరానికి వాడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.