పట్నా: ఆర్జేడీ అధినేత లూలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. లూలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు నెలలుగా తనకు తిండి కూడా పెట్టడం లేదని ఆమె తన అత్త రబ్రీదేవి, ఆడపడుచు మీసా భారతిపై ఆరోపణలు గుప్పించారు. తనను వంటింట్లోకి కూడా రానీయడం లేదని తెలిపారు. ఆదివారం ఆమె ప్రెస్ మీట్ పెట్టి మొదటిసారి అత్తింటి వేధింపులపై నోరువిప్పారు. అత్తింటివారు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఐశ్వర్య ఆరోపించారు. ఔట్ హౌస్ వెలుపల ఉన్న షెడ్ లో తనను పడేశారన్నారు. వంటగదిలో కూడా తనను అడుగు పెట్టనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తేజ్ ప్రతాప్, తేజస్వీ యాదవ్ సోదరులిద్దరి మధ్య కూడా మీసా భారతి గొడవలు పెడుతున్నారని ఆరోపించారు.
అత్త రబ్రీదేవి, ఆడపడుచు మీసా భారతికి తానంటే మొదటి నుంచీ ఇష్టం లేదని, పెళ్లైన నాటి నుంచి తనను వివక్షగానే చూస్తున్నారనీ తెలిపారు. తనను ఇంటి నుంచి గెంటివేయటానికి ఎంతగానో యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచు మీసాభారతి వల్లే సమస్య పెద్దదైందని చెప్పారు. మూడు నెలలుగా పుట్టింటివారు పంపుతున్న ఆహారంతోనే కడుపునింపుకుంటున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో తన తండ్రి చంద్రికా రాయ్ తో కలసి లాలూ ఔట్ హౌస్ లో ఆమె ధర్నాకు దిగారు. అయితే, పోలీసుల జోక్యంతో ఆమె తిరిగి ఇంట్లోకి వెళ్లారు.
మరోవైపు ఐశ్వర్య చేసిన ఆరోపణలను ఆమె ఆడపడుచు ఆర్జేడీ ఎంపీ మీసా భారతి ఖండించారు. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల్లో తనను లాగారని చెప్పారు. గత కొద్ది కాలంగా తాను పట్నాకు రాలేదన్నారు. కోర్టు కేసులకు హాజరయ్యేందుకు తాను మూడు, నాలుగు సార్లు మాత్రమే పట్నాకు వచ్చానని తెలిపారు. తనపై ఐశ్వర్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఇదిఇలా ఉంటే..భార్యతో విడాకులు కోరుతూ ఆరు నెలల క్రితం తేజ్ ప్రతాప్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తమ కాపురం నిలబడుతుందనే ఆశతో ఐశ్వర్యారాయ్ తన అత్త ఇంట్లోనే ఉంటోంది.