(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపు తిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ శనివారం(నవంబర్ 23) ప్రమాణస్వీకారం చేశారు. తన ప్రత్యేక అధికారాలను వినియోగించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ సమావేశం కాకుండానే రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు సిఫార్సు చేశారు. దీనికి రాష్ట్రపతి రామ్ నాథ్ సమ్మతించడంతో శనివారం ఉదయం 7. 50 గంటలకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ దేవేంద్ర ఫడ్నవీస్ తో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. నవంరబర్ 30 కల్లా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని ఫడ్నవీస్ కు గవర్నర్ సూచించారు.
మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తున్న తరుణంలో ఎన్సీపీ నుంచి వేరుపడిన అజిత్ పవార్ వర్గం బీజేపీకి మద్దతు పలకడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఎన్సీపీ బీజేపీతో ఎప్పటికీ జతకట్టదని చెప్పిన అజిత్ పవారే.. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. అజిత్ పవార్ పై మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం మొదలుకొని పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయి. దీంతో వాటిని అడ్డం పెట్టుకుని బిజెపి రాజకీయం చేసిందని, అజిత్ పవార్ ను భయపెట్టి తమవైపు తిప్పుకుందనే వాదనలు వివిపిస్తున్నాయి. అయితే అజిత్ పవార్ పై తమకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ప్రధాని మోదీ ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగానే బీజేపీ పక్కా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం జరగబోతుందని ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. ఇందతా రహస్య వ్యవహారంలా సాగింది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఢిల్లీలో రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగిన గవర్నర్ల సదస్సుకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆయన తన పర్యటనను రద్దు చేశారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేకున్నట్లు ప్రచారం జరింది. అయితే, పఢ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం కోసమే ఆయన ఢిల్లీకి వెళ్లలేదని తర్వాత అందరికీ తెలిసింది. శుక్రవారం అర్ధరాత్రి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాలని సిఫార్సు చేస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కేంద్రానికి నివేదిక పంపారు. అనంతరం రాష్ట్రపతి పాలన ఎత్తివేతపై కేంద్ర హోంశాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ ను వెలువరించింది. అనంతరం ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
గవర్నర్ తీరుపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తీవ్రంగా స్పందించాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తమకు 144 మందికి పైగా మద్దతు ఉందని, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ మూడు పార్టీలను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరాయి.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరైయ్యారు. అజిత్ వెంట వెళ్లిన ఏడుగురు ఎమ్మెల్యేలు వెనక్కి తిరిగొచ్చి పవార్ ను స్వయంగా కలుసుకున్నారు. అధినేత పట్ల తమ సంపూర్ణ విశ్వసాన్ని ప్రకటించినట్లు సమాచారం. ఎన్సీపీకి చెందిన 54మంది ఎమ్మెల్యేల్లో.. 40 మంది ఎమ్మెల్యేలు పవార్ ను కలిసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా… బీజేపీ 105 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల చొప్పున దక్కించుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల బలం కావాలి. తమకు 144 మందికిపైగా మద్దతు ఉన్నారని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు చెబుతున్నాయి.
ఇదిఇలా ఉంటే.. తాము ప్రజాతీర్పునకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని కేంద్రం మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం కోసం ఫడ్నవీస్ కు మద్దతుగా ఎన్సీపీ నేత ముందుకు వచ్చారని ఇది ప్రజాస్వామ్య హత్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. శివసేన తన స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో రాజకీయ స్నేహ బంధాన్ని తెంచుకొని బద్ధవిరోధులైన కాంగ్రెస్, ఎన్సీపీతో కలవడాన్ని ఏమంటారని నిలదీశారు.
మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారం చేపట్టకుండా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యవహరించిన తీరు రాజకీయ పండితుల్ని సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. మహారాష్ట్ర పరిణామాల్ని నెలరోజుల నుంచి రాత్రీపగలూ చూస్తున్న ప్రజలు, జర్నలిస్టులు సైతం షాక్ అయ్యారు. బీజేపీ వ్యూహంతో ప్రజలే పిచ్చోళ్ళు అయ్యారు.
ది టెలిగ్రాఫ్ పత్రిక సౌజన్యంతో