(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అయోధ్య కేసు తీర్పు అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కి లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 11న ప్రధాని మోదీ సంతకంతో కూడా ఓ లేఖ వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. అందులో..‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ గారికి, మీ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి శుభాకాంక్షలు. జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లు హిందూ రాష్ట్రానికి అద్భుతమైన సహకారం అందించారు. మీ నిర్ణయం చిరస్మరణీయం. హిందువులు ఎల్లప్పుడూ మీకు, మీ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇది హిందూ రాష్ట్రానికి చరిత్రాత్మక తీర్పు. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఈ గొప్ప నిర్ణయానికి మరోసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను’ అని ఆ లేఖలో ఉంది.
అయితే, ఈ లేఖను నిజంగా ప్రధాని రాశారా ? అన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమైంది. లేఖలో రాసిన భాషలో కొంచం తేడాగా ఉంది. కొన్ని చోట్ల అక్షర దోషం కూడా ఉంది. ఈ లేఖను నిజంగా ప్రధాని పంపినట్లయితే అది జాతీయ వార్త అయ్యేది. కానీ అలా జరగలేదు. అయితే ఆల్ట్ న్యూస్ మీడియా ఈ వార్తలో నిజం ఉందా ? లేదా అన్నది తెలుసుకుంది. ప్రస్తుతం ప్రచారం అవుతున్న లేఖను పోలి ఉన్న ఓ లేఖను గతంలో మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు ప్రధాని మోదీ రాసినట్లు గుర్తించారు. ఈ రెండు లేఖలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి.
Thanks @narendramodi @PMOIndia for the kind words. Nothing of this would have been possible without love and support of our fellow countrymen. All these deeds are dedicated to our country. pic.twitter.com/3P3HcViIJ5
— Gautam Gambhir (@GautamGambhir) December 16, 2018
ఈ రెండు లేఖలను పరిశీలిస్తే.. గంభీర్ కి రాసిన లేఖ చివరల్లో అడ్రస్ ఉంది. కానీ, అదే ప్రధాన న్యాయమూర్తికి రాసినట్లు ప్రచారం అవుతున్న లేఖలో మాత్రం ఎలాంటి అడ్రస్ లేదు. అంతే కాదు గంభీర్ లేఖలోని నేపథ్య ఆకృతి అక్షరం అంతటా స్థిరంగా ఉందని గమనించవచ్చు. అదే వైరల్ అవుతున్న లేఖలోని అక్షరానికి స్థిరమైన ఆకృతి లేదు. పదాలు లేని చోట మాత్రమే ఆకృతి నేపథ్యం ఉంటుంది. ఈ రెండు లేఖల పరిశీలన, విశ్లేషణ అనంతరం మోదీ భారత ప్రధాన న్యాయమూర్తికి అభినందన లేఖ రాశారన్న దాంట్లో నిజం లేదని స్పష్టమైంది.
ఆల్ట్ న్యూస్ మీడియా సౌజన్యంతో
.