ట్రంప్ ని ఎలా ఇరుకున పెట్టాలా? అని సిఎన్ఎన్ చూస్తుంది…!
మోదీ, అమిత్ షా దొరికితే ఇరుకున పెట్టాలని ఎన్డీటీవీ, ఆజ్ తక్ వంటి చానెళ్లు చూస్తుంటాయి…! జగన్ ని ఎలాగైనా దించేయాలని ఆంధ్రజ్యోతి, టివి5, ఈనాడు చూస్తున్నాయి. ఇక చంద్రబాబుని మళ్ళీ ఎక్కకుండా చేయాలని సాక్షి పనిగట్టుకుంది. ఇలా నాయకుల గుప్పిట్లోనూ, నాయకులకు వ్యతిరేకంగానూ మీడియా మారిపోయింది. ఇది మీడియాకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. సరే ఎలాగోలా ప్యాకేజీలతో నెట్టుకొచ్చేయాలనే ప్లాన్లతో సంస్థలు నడుస్తున్నాయి. ఇది మొదట మొదలయ్యింది ఏపీలోనే. నెమ్మదిగా ఇండియా మొత్తానికి పాకి, విశ్వమంతటా నెమ్మదిగా వ్యాపిస్తుంది. నాయకులకు వ్యతిరేకంగా, లేదా అనుకూలంగా మీడియా సంస్థలు పని చేయడం వరకు అవి వారి సొంత ఉద్దేశాలు అనుకోవచ్చు, కానీ నాయకులు పాలకులయ్యాక కూడా చీటికీ మాటికీ అకారణంగా దెబ్బ తీయాలని చూస్తేనే వ్యవస్థకు నష్టం కలిగేది. గడిచిన ఐదేళ్లు సాక్షి, ఇప్పుడు ఆంధ్రజ్యోతి చేస్తున్నది అదే. మంచి పథకాలు కళ్ళకు కనిపించక కులం మత్తు, తమ నాయకుడు అనే భజనలో ఆరితేరుతున్నాయి. సాక్షి కథ వేరు. అది పుట్టడమే నాయకుడి నుండి. అందుకే అలాగే ఉంటుంది. అలాగే చస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి పరిస్థితి వేరు. ఒక జర్నలిస్టు మీడియా సంస్థగా మొదలుపెట్టి ఇప్పుడు పార్టీకి, కులానికి తాకట్టు పెట్టారు.
“సోషల్ మీడియాని నమ్మకూడదు ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రచారం చేస్తారు” అని అంటుంటారు. నిజమే సోషల్ మీడియాలో 90 శాతం ఫేక్ ఉండొచ్చు. కానీ మీడియాలో ఎంత వాస్తవికత ఉంది? వ్యవస్థలో నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా వాస్తవికతను పాతరేసి సొంత అజెండాలతో సంస్థలను నడుపుతున్నారు. తెలుగునాట ప్రతి మీడియా సంస్థకి వెనుక ఏవేవో రాజకీయ శక్తులున్నాయి. ఈనాడు సంస్థలకు నేరుగా కాకపోయినా పరోక్షంగా రాజకీయ సహకారం ఉంటుంది. టివి 9 కి జూపల్లి రామేశ్వరరావు రూపంలో కేసీఆర్, టివి 5 ఏర్పాటు సమయంలో వైస్సార్ సహకారం అందించగా, నేడు చంద్రబాబు దన్నుగా ఉన్నారు. ఏబీన్ పూర్తిగా కులం, పార్టీకి మారిపోయింది. ఎన్టివీ కూడా రాజకీయ శక్తుల సహకారంతోనే నడుస్తుంది. ఇక జాతీయస్థాయిలో చూసుకుంటే కాంగ్రెస్ ఎంపీ (లెఫ్ట్ ఎంపీకి బంధువు)కి ఎన్డిటివి ఉంది. ఇక ఆజ్ తక్, ఇండియా టీవీలు ప్యాకేజికి అనుబంధంగా పని చేస్తాయి. బీజేపీకి అనుబంధంగా రిపబ్లిక్ టివి, జీ నెట్వర్క్ పని చేస్తున్నాయి. కానీ తెలుగునాట ఉన్నంత చెత్త రాతలు, దిగజారుడు వర్థకథనాలు జాతీయస్థాయిలో లేవు.
వారానికోసారి చెత్త వంట…!
మీడియా అంటే జనాలకు ఇప్పటికీ కాస్తో, కూస్తో గౌరవం ఉంది. నాయకులకు భయం, భక్తి ఉన్నాయి. కానీ ఇది ఎక్కువకాలం మాత్రం కొనసాగదు. దానికి తార్కాణమే నానాటికీ క్షీణిస్తున్న దిన పత్రికల సర్క్యులేషన్లు. ఈనాడు పత్రిక నెలకు 10 వేల కాపీలు కోల్పోతుంది. అంధ్రజ్యోతి, సాక్షిలు కూడా అదే కోవలో ఉన్నాయి. ఇక మీడియా నాట కథనాల్లో డొల్లతనం చెప్పుకోవాలంటే కోకొల్లలు. ఉదాహరణగా… ఆంధ్రజ్యోతిలో వారం వారం వచ్చే “కొత్తపలుకు”లో చెత్త రాతలు ఎక్కువవుతున్నాయి. ప్రతివారం జగన్ ని విమర్శించడమే, తిట్టిపోయాడమే పనిగా ఆ కొత్తపలుకు మారింది. గత వారం అమ్మఒడి పథకంపై లాజిక్ లేని పలుకులు పలికిన రాధాకృష్ణ ఈరోజు కొత్తపలుకులో జగనన్న వసతి విద్యాదీవెనపై సరికొత్త రాగాలు ఆలపించారు. సంవత్సరం మొత్తం ఇవ్వాల్సిన డబ్బులు ఒకేసారి ఇస్తే మహిళలు వృథా చేస్తారట. బిడ్డ పేరిట వచ్చే డబ్బుని బిడ్డకి ఎలా ఖర్చు చేయాలో తల్లులకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదన్న కనీస జ్ఞానాన్ని వదిలి, పథకాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. విమర్శించాలి అనుకుంటే అసలు నేరుగా డబ్బులు ఇచ్చే పథకాలన్నింటినీ విమర్శించాల్సిందే. ఇది రెండు దశాబ్దాల కిందటే తెలుగునాట బీజం పడింది. ఓట్ల రాజకీయాలతో జనాలకు పంపిణీలు నాడే మొదలయ్యాయి. దాన్ని చంద్రబాబు ఎక్కువ చేస్తే, జగన్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రాధాకృష్ణ ప్రత్యేకంగా జగన్ పై ఏడ్చి ప్రయోజనం లేదు.
శ్రీనివాస్ మానెం