(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్పై అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఔట్ సోర్సింగ్ సర్వీసెస్పై టిడిపి సభ్యులు సంధించిన ప్రశ్నలకు సిఎం జగన్మోహనరెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, కె కన్నబాబులు సమాధానమిచ్చారు.
వైసిపి కార్యకర్తల కోసం కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తోందని టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే పని ఇన్చార్జి మంత్రులకు అప్పగించారనీ, ఆరు నెలల్లో రెగ్యులరైజ్ చేస్తామనీ చెబుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
దీనిపై మంత్రి బుగ్గన మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అన్ని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. అవాస్తవాలు చెబుతున్న అచ్చెన్నకు సభాహక్కుల నోటీసు ఇస్తామని పేర్కొన్నారు. టిడిపి అబద్దాల ఫ్యాక్టరీ అంటూ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దీనస్థితికి ప్రధాన కారణం టిడిపి ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
టిడిపి ఆరోపణలపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలు చెప్పే వారిపై సభాహక్కుల నోటీసు ఇవ్వాల్సిందేనన్నారు. గతంలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లన్నీ చంద్రబాబు బంధువు భాస్కరనాయుడుకే అప్పగించారని అన్నారు. గుళ్లలోని పారిశుద్ధ్య పనుల కాంట్రాక్ట్లను కూడా భాస్కరనాయుడుకే ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ పేరుతో ఉద్యోగులను దోచుకున్నారని జగన్ ఆరోపించారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్ ఇస్తూ ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తుంటే ప్రతి దాంట్లో అవాస్తవాలు, వక్రీకరణలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.