(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. కస్టోడియల్ డెత్ కింద ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అభ్యర్థించారు. పోలీసులు నిందితులను నకిలీ ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు.
మరోవైపు ఎన్కౌంటర్లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలకు ఇంకా అంత్యక్రియలు పూర్తి అవ్వలేదు. మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా.. నిందితుల అంత్యక్రియలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా, వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్కౌంటర్పై విచారణకు ముగ్గురు రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ను ఏర్పాటు చేసింది.
నవంబర్ 27వ తేదీ రాత్రి శంషాబాద్ సమీపంలోని చటాన్పల్లి వద్ద దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి.. హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను డిసెంబర్ 6వ తేదీన పోలీసులు ఘటనా స్థలికి తీసుకెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ చేశారు. అయితే, తమ వాళ్లు తప్పు చేస్తే కోర్టు ద్వారా శిక్షించాలి కానీ, ఇలా చంపేయడం ఏంటని ? నిందితుల కుటుంబసభ్యులు ప్రశ్నించారు. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ రంగంలోకి దిగి ప్రత్యక్షంగా విచారణ జరిపింది.