బెంగళూరు: కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు(కాంగ్రెస్, జేడీఎస్) గురువారం బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆరాష్ట్ర డిప్యూటీ సీఎం అశ్వంత్ నారాయణ తెలిపారు. అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ పార్టీ సీనియర్ నాయకులను కలిశారని వెల్లడించారు. సీఎం యడియూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కతిల్ సమక్షంలో గురువారం ఉదయం 10.30 గంటలను వారు బీజేపీలో చేరనున్నట్లు చెప్పారు. ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన అనంతరం వీరిలో పలువురు ఎమ్మెల్యేలు అశ్వంత్ నారాయణతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ను ఢిల్లీలో కలిశారు.
కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. కానీ, వారిని ఉపఎన్నికల్లో పోటీకి అనుమతించింది. ఈమేరకు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. అక్టోబర్ 25న ఈ అంశంపై విచారణ పూర్తిచేసిన ధర్మాసనం.. తుది తీర్పును బుధవారం వెల్లడించింది.
కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించారు. కాంగ్రెస్కు చెందిన 14 మంది, జేడీఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఈ ఏడాది జూలై నెలలో అనర్హత వేటు వేశారు. వారు తిరిగి ఉపఎన్నికల్లో పోటీచేయకుండా ప్రస్తుత శాసనసభ ముగిసేవరకూ అనర్హులుగా పేర్కొంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాము రాజీనామా చేశాం కాబట్టి తమపై అనర్హత వేటు వేయడమే కుదరదని రెబల్ శాసనసభ్యులు వాదించారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో వారు డిసెంబర్ అయిదున జరగనున్న ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు మార్గం సుగమం అయింది. 17 సీట్లకు గాను 15 సీట్లకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
రెబల్ శాసనసభ్యులను బిజెపి అభ్యర్ధులుగా పోటీలో దింపే అవకాశం ఉంది. వారి కారణంగానే తమ ప్రభుతం ఏర్పడిందనీ, వారిని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉందనీ ముఖ్యమంత్రి యదియూరప్ప తమ పార్టీ నాయకులతో చెబుతున్న వీడియో రికార్డింగ్ ఇటీవల బయటకు వచ్చింది. ప్రస్తుతం 224 సీట్ల సభలో ప్రస్తుతం బిజెపికి 106 మంది సభ్యుల మద్దతు ఉంది. జెడిఎస్ – కాంగ్రెస్ సంకీర్ణానికి 101 మంది సభ్యులు ఉన్నారు. యదియూరప్ప ప్రభుత్వం కొనసాగాలంటే ఉపఎన్నికలు జరిగే 15 స్థానాలలో కనీసం ఆరు సీట్లలో విజయం సాధించాలి.