(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏపి శాసనమండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. కౌన్సిల్ను రద్దు చేస్తూ ఆంధ్రపదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ముందుగా నిన్న రాత్రి అసెంబ్లీలో చేసిన తీర్మాన ప్రతితో పాటు ఓటింగ్కు సంబంధించిన వివరాలను, బిల్లులకు సంబంధించిన అంశాలను శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, హోం, న్యాయశాఖలకు పంపారు. దీనిపై కేంద్ర మంత్రి వర్గంలో తీర్మానం చేసిన అనంతరం రాజ్యంగ అధికరణ 169(1) ప్రకారం మండలి రద్దుకు పార్లమెంట్లో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టనుంది.
మండలి రద్దు విషయంలో ప్రభుత్వం మూడవ అడుగు వేసినట్లు అయ్యింది. తొలుత కేబినెట్లో మండలి రద్దుకు తీర్మానం, తర్వాత అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.