మోదీకి క్లీన్ చిట్ ఏకగ్రీవం కాదు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలకు రెండు సందర్భాలలో క్లీన్ చిట్ ఇచ్చే విషయంలో ఎన్నికల సంఘంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయంలో సంఘం సభ్యుల మధ్య చీలిక కూడా వచ్చినట్లు ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తన కథనంలో పేర్కొంది. ఈ రెండు సందర్భాల్లోనూ ఒక కమిషనర్ ఈసీ తుది నిర్ణయాలకు డిసెంట్ తెలిపారని, దాంతో 2-1 ఆధిక్యంతో ప్రధానికి క్లీన్ చిట్ లభించిందని తెలిసింది.
రాజస్థాన్ లోని బార్మర్ లో చేసిన ప్రసంగం విషయంలో మాత్రం ఎన్నికల సంఘం ఏకాభిప్రాయంతో నిర్ణయం వెల్లడించింది. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు దీపావళి కోసం ఏమీ దాచిపెట్టుకోలేదని పాకిస్థాన్ ను మోదీ అక్కడ హెచ్చరించారు. ‘వాళ్లు ప్రతిరోజూ తమ వద్ద న్యూక్లియర్ బటన్ ఉందని చెబుతున్నారు. మనం దాన్ని ఏమైనా దీపావళి కోసం దాచిపెట్టామా?’ అని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఉన్నారు.
ఎన్నికల కమిషన్ చట్టం పదో సెక్షన్ ప్రకారం, వీలైనంత వరకు ఈసీ కార్యకలాపాలన్నీ ఏకాభిప్రాయంతో జరగాలి. ఏదైనా విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల మధ్య భేదాభిప్రాయం ఉంటే మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయించాలని కూడా అందులో చెప్పారు. అయితే ఈ చట్టం రూపొందించినప్పటి నుంచి మెజారిటీ అభిప్రాయాలు తీసుకోవడం చాలా అరుదుగా జరిగింది. 2009 నుంచి చూస్తే అతి కొద్ది ఉదాహరణలు మాత్రమే ఇలా భిన్నాభిప్రాయాలకు కనిపిస్తాయి. విదేశీ అవార్డు తీసుకున్నందుకు సోనియా గాంధీపై అనర్హత వేటు వేయాలా వద్దా అన్న విషయమై ఈసీ తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపింది. అప్పుడు ఎన్.గోపాలస్వామి ప్రధాన కమిషనరుగాను, ఎస్.వై ఖురేషి, నవీన్ చావ్లా కమిషనర్లుగాను ఉన్నారు. 2006 నవంబరులో సోనియాగాంధీ బెల్జియం నుంచి అవార్డు తీసుకోవడంపై విచారణ అవసరమని గోపాలస్వామి భావించగా, దాన్ని చావ్లా, ఖురేషి కొట్టేశారు. ఇప్పటికే విచారణ జరిగిందని, తదుపరి చర్యలు అవసరం లేదని చెప్పారు.
కానీ మోదీ ప్రసంగాలలో కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై మాత్రం ప్రస్తుత కమిషన్ లో విభేదాలు తలెత్తాయి. రాహుల్ గాంధీ వయనాడ్ లో పోటీ చేయడాన్ని ప్రస్తావిస్తూ మెజారిటీలు మైనారిటీలుగా ఉన్న ప్రాంతానికి శరణార్థిగా రాహుల్ వెళ్లిపోయారని మోదీ వార్ధాలో వ్యాఖ్యానించారు. ఇది వివిధ వర్గాల మధ్య విభేదాలకు దారితీస్తుందని ఫిర్యాదురాగా, సంబంధిత సెక్షన్లను మోదీ ప్రసంగం ఉల్లంఘించలేదని ఎన్నికల సంఘం తేల్చింది. అలాగే లాతూరులో చేసిన ప్రసంగంలో తొలిసారి ఓటర్లు పుల్వామా అమరులకు, బాలాకోట్ వైమానిక దాడుల్లో పాల్గొన్న సైనికులకు తమ ఓటు అంకితం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఉస్మానాబాద్ జిల్లా ఎన్నికల అధికారి నివేదికను కూడా ఈసీ తోసిపుచ్చింది. ఈసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ సుష్మితాదేవ్ సుప్రీంకోర్టును కోరగా.. అమిత్ షా, మోదీలపై ఉన్న ఫిర్యాదులన్నింటినీ మే 6లోగా పరిష్కరించాలని ఈసీకి కోర్టు సూచించింది.