(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా ? ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో మాజీ మంత్రి డి.కె.అరుణని నియమించనున్నారా? ఇప్పుడు ఆ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. జాతీయ నాయకత్వం పార్టీలోని కొందరి పేర్లు పరిశీలిస్తుంది. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మాజీ మంత్రి డి.కె.అరుణ తన లక్ష్యానికి మరింత చేరువయ్యారని ప్రచారం జరుగుతోంది. మద్యనిషేధాన్ని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల దీక్షకు దిగడం.. దానికి యావత్ తెలంగాణ బీజేపీ నేతలు అండగా నిల్వడం చూస్తుంటే అధ్యక్ష పదవి ఆమెకే దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీలు వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో డి.కె.అరుణ మాస్ లీడర్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆమె.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిణామాలు..పార్టీలో వర్గపోరు.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సత్సంబంధాలు లేకపోవడంతో అరుణ బీజేపీలో పార్టీలో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల ముందు కమల తీర్థం పుచ్చుకున్న అరుణ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే అరుణ గట్టి పోటీనే ఇచ్చారు. కానీ త్రిముఖ పోరులో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్ష స్థానం కోసం ఢిల్లీ పెద్దల్ని మెప్పించేందుకు అరుణ ప్రయత్నిస్తున్నారు. ఒక దశలో ఆమె పేరు ఖరారైందన్న ప్రచారమూ జరిగింది. అయితే, పార్టీ అధిష్టానం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అరుణ పార్టీలోకి రావటంలో కీలకపాత్ర పోషించిన జాతీయ నాయకుడు ఒకరు ఆమెకు పదవి ఇప్పించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెడుతూ జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షిస్తున్నారు. తెలంగాణలో మద్యనిషేధం డిమాండ్ అరుణ..రెండ్రోజుల దీక్షకు పూనుకోవడం సర్వత్రా ఆసక్తి రేపింది. ఈ దీక్షకు పార్టీలోని సీనియర్ల నుంచి మద్దతు లభించింది. మహిళా నేతలు పెద్ద ఎత్తున దీక్షలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో పార్టీలో మెజారిటీ వర్గాన్ని ఒక్కతాటి మీదికి తెచ్చారన్న ఘనత అరుణకు దక్కిందని, ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్ష స్థానానికి అరుణ మరింత దగ్గరయ్యరని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే పార్టీలో సీనియర్లను కాదని ఆమెకు పదవి ఇస్తే మిగతా నాయకులు ఫీల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. చాలాకాలంగా పనిచేస్తున్న వారిని కాదని మధ్యకాలంలో చేరిన అరుణకు అధ్యక్ష పీఠం కట్టబెడతారా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి తననే కొనసాగించాలని ప్రస్తుత ప్రెసిడెంట్ లక్ష్మణ్ కోరుతున్నారు. మరికొంతమంది అధ్యక్ష పదవి కోసం హస్తినలో లాబీయింగ్ చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లక్షణ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లగా అసెంబ్లీలో ఒక్క స్థానానికే పరిమితం కాగా.. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొందడం పార్టీకి ప్లస్గా మారింది. మొత్తం మీద డిసెంబర్ నెలాఖరు నాటికి తెలంగాణ బిజెపికి కొత్త అధ్యక్షుని ఎంపిక పూర్తి చేయాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. మరి అరుణకు అవకాశం వస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.