అమరావతి: డిఎంకె అధినేత స్టాలిన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కలిసిన 24గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన ముఖ్యుడు ఒకరు అమరావతికి వచ్చి చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయవర్గాలలో చర్చకు దారి తీసింది. తమిళనాడుకు చెందిన డిఎంకె నేత దురై మురుగన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
స్టాలిన్, కెసిఆర్ మధ్య జరిగిన చర్చల సంగతులను చంద్రబాబుకు వివరించేందుకు దురై మురుగన్ వచ్చినట్లు భావిస్తున్నారు.
భవిష్యత్తు కార్యాచరణపై తీసుకోవాల్సిన అంశాలపై కూడా చంద్రబాబుతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
గతంలో థర్డ్ ఫ్రంట్ ప్రయోగం రెండు సార్లు విఫలం అయినందున స్టాలిన్ మొదటి నుండి మూడో కూటమిపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్న చంద్రబాబుతో స్టాలిన్ సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నారనీ, అందులో భాగంగానే దొరై మురగన్ను అమరావతికి పంపారని భావిస్తున్నారు.