(న్యూస్ అర్బిట్ బ్యూరో)
చెన్నై: పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ డిఎంకె నేత స్టాలిన్ సోమవారం పౌరసత్వం సవరణ బిల్లుకు నిరసనగా చెన్నైలో భారీ ర్యాలీ తీశారు. కాంగ్రెస్ నేత పి. చిదంబరం కూడా ఆయనకు జత కలిశారు. ఈ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగవచ్చన్న భయాన్ని వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలయింది.
అయితే హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. విధ్వంసం సంభవించిన పక్షంలో దానికి ఎవరు బాధ్యులో తేల్చడానికి వీలుగా ర్యాలీని వీడియో తీయాల్సిందిగా మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ర్యాలీని డ్రోన్లతో కూడా రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం తమ విజయమని పేర్కొన్న స్టాలిన్ ముందు అనుకున్న విధంగా ర్యాలీ ప్రారంభించారు.
ముస్లిం హక్కులను కాలరాస్తున్న ఈ చట్టం రద్దు కోరుతూ సమాజంలోని అన్ని వర్గాలూ ఉద్యమించాలని స్టాలిన్ కోరారు. బిల్లును సమర్ధించినందుకు ఆయన అధికారపక్షమైన అన్నాడిఎంకేను కూడా విమర్శించారు. అన్నాడిఎంకె మద్దతు లేకపోతే ఈ బిల్లు రాజ్యసభలో వీగిపోయేదని ఆయన అన్నారు. పౌరసత్వం సవరణ చట్టం వల్ల ముస్లింల హక్కులకు వచ్చిన ముప్పేమీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి అంటున్నారు.