(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
గోహతి : బ్రహ్మపుత్ర నదిపై రూ.5,920 కోట్ల వ్యయంతో నిర్మించిన భారతదేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెనను దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ జయంతి సందర్భంగా మంగళవారం (డిసెంబర్ 25) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ బోగీబీల్ వంతెన నిర్మానికి 1997లో అప్పటి ప్రధాని దేవగౌడ శంకుస్థాపన చేయగా 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పనులను ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన నాటి నుండి ఈ పనులు పూర్తి కావడానికి 21ఏళ్లు పట్టింది.
అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మించారు ఈ డబుల్ డెక్కర్ వంతెన వల్ల అసోంలోని తిన్సుకియా, అరుణాచల్ప్రదేశ్లోని నహర్ల్గన్ పట్టణాల మధ్య 500 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు దూరం తగ్గి దాదాపు 10 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది.
ఇంజినీరింగ్ అద్భుతంగా పేర్కొనే ఈ బోగీబీల్ వంతెన రక్షణ పరమైన అవసరాలకూ, ఈశాన్య సరిహద్దు భద్రతా దళానికి చక్కని మౌలిక వసతిగా ఉపయోగపడనుంది. వంతెన కింది భాగంలో రెండు లైన్ల రైలు పట్టాలు, పైభాగంలో మూడు లైన్ల రహదారి ఉంటాయి. ఈశాన్య సరిహద్దుకు రక్షణ సామగ్రిని తరలించే అత్యంత భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా దీన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. బ్రహ్మపుత్ర నదిపై వంతెన నిర్మించడం సవాలుతో కూడుకున్నది. ఈ వంతెన ప్రభావంతో అసోంలోని డిబ్రోగఢ్ నగరం బిజినెస్ హబ్గా అభివృద్ధి చెందుతుంది. విద్యా, వైద్య, ఇతర రంగాలకు మరింత ఊతమిచ్చినట్లు అవుతుందని ఒక అధికారి పేర్కొన్నారు.