(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాలను చూస్తే బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నట్లు స్పష్టమవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ.. మరోసారి తమదే అధికారమని చెబుతోంది. కానీ పరిస్థితులు చూస్తే దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా రాష్ట్రాలు చేజారిపోతున్నాయి. కాషాయం పలుచబడిపోతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా.. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఓటమి చవి చూస్తోంది. హర్యానాలో మిత్ర పక్షంతో అధికారాన్ని చేపట్టిన కాషాయ పార్టీ.. మహారాష్ట్రలో శివసేనను దూరం చేసుకుని అధికారన్ని కోల్పోయింది. తాజాగా జార్ఖండ్ లో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాలను ఈ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు జార్ఖండ్ ఐదో రాష్ట్రంగా నిలిచింది. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గత 12 నెలల్లోకాంగ్రెస్ ధాటిని బీజేపీ ఎదుర్కోలేక చతికిలబడింది. ఇక జార్ఖండ్ ఎన్నికల ఫలితాల విషయానికే వస్తే.. బీజేపీ బొక్కబోర్లా పడింది. కొత్తగా సీట్లు సాధించడం పక్కన పెడితే.. 12 సిట్టింగ్ స్థానాలు గల్లంతయ్యాయి. సీఎం రఘువర్ దాస్ సహా ఆరుగురు మంత్రులు ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీజేపీకి మిత్ర పక్షమై.. ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగిన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ రెండు చోట్ల గెలిచింది. 81 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 41 స్థానాలు. జేఎంఎం 30 చోట్లు, కాంగ్రెస్ 16 స్థానాల్లో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలవడంతో ఆ కూటమికి 47 స్థానాలు లభించినట్లయింది. దీంతో ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 25 స్థానాలకే పరిమితమయింది.
దేశంలో ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగానో, సంకీర్ణ భాగస్వామిగానో అధికారంలో ఉంది. మహారాష్ట్రలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కమలనాథులను కాంగ్రెస్ నేతలు దీటుగా ఓడించ గలిగారు. గత మే నెలలోజరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రాల్లో విజయం సాధించినా.. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఘెరంగా ఓటమి పాలైంది. రాష్ట్ర స్థాయిలో ఇది నాయకత్వ పటిమను కోల్పోతోందని తెలుస్తోంది. అలాగే.. ప్రధాని మోదీ కరిష్మాకూడా ఈ ఎన్నికల్లో కమలం పార్టీ విజయానికి తోడ్పడలేకపోతోందని అర్థమవుతోంది.
గతంలో పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులకు గురి చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, ఎన్ఆర్సీ వంటి నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆపార్టీకి గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. మొదటి నుంచి బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ.. జాతీయత, హిందూత్వం. ఇన్నికల్లో కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ అది బెడిసికొట్టింది. 2014 ఎన్నికలకు.. ఇప్పటికీ జనం ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా ? బీజేపీ దేశంలోని ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా మతరాజకీయాలు చేస్తోందని ప్రజలు భావిస్తున్నారా ? లేక అధికారం కోసం బీజేపీ చేస్తున్న అడ్డగోలు పనులపై విసుగెత్తిపోయారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.