ములాయంపై సుష్మాస్వరాజ్ మండిపాటు
న్యూఢిల్లీ: రాంపుర్ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జయప్రదపై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యల మీద కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. రాంపుర్ లో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే మౌనంగా ఉండద్దని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు ఆమె సూచించారు. జయప్రదను విమర్శిస్తూ ఆజంఖాన్.. ఆమె వేసుకునే లోదుస్తులు ఖాకీరంగువని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయినా అఖిలేశ్ పల్లెత్తు మాట అనలేదు. దీనిపై సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ కు తెలిపారు. ‘‘ములాయం భాయ్, మీరు సమాజ్ వాదీ పార్టీకి పెద్ద తలకాయ లాంటివారు. మీ కళ్లెదుటే రాంపుర్ లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. మీరు భీష్ముడిలా మౌనంగా కూర్చోవద్దు’’ అని తెలిపారు. ఈ ట్వీట్ లో ఆమె అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్, పార్టీ నాయకురాలు జయాబచ్చన్ లను కూడా ట్యాగ్ చేశారు.
ఆజంఖాన్ ఓ సభలో ఆదివారం మాట్లాడారు. ‘‘నా ప్రస్తుత బీజేపీ అభ్యర్థి మీద చాలా ఆరోపణలొచ్చాయి. చనిపోయిన మా తల్లి మీద ఒట్టు.. అవన్నీ తప్పు. నేను పిరికివాడిని కాను. నేనేదైనా అంటే, దాన్ని ఒప్పుకొంటా. ఎవరైనా రాజకీయాల్లో మరీ దిగజారిపోవాలా? రాంపూర్ రక్తాన్ని పదేళ్ల పాటు తాగేసిన ఈ వ్యక్తిని నేను రాంపూర్ కు వేళ్లు పట్టుకుని తీసుకొచ్చాను. ఈ వ్యక్తికి రాంపూర్ వీధులు ఎలా ఉంటాయో పరిచయం చేశాను. ఆమెను ముట్టుకోవడానికి గానీ, కనీసం తప్పుగా మాట్లాడటానికి గానీ నేను ఎవరినీ అంగీకరించలేదు. ఆమెను మీరు పదేళ్ల పాటు ప్రతినిధిగా చేశారు. కానీ, ఆమెకు.. నాకు తేడా ఏంటంటే, రాంపుర్, షాబాద్, భారతదేశ ప్రజలంతా ఆమె అసలు రంగు గుర్తించడానికి 17 ఏళ్లు పట్టింది. నాకు మాత్రం కేవలం 17 రోజుల్లోనే ఆమె వేసుకున్న అండర్ వేర్ ఖాకీ రంగుదని తెలిసిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ ఆజంఖాన్ మీద ఎఫ్ఐఆర్ దాఖలుచేసింది.
मुलायम भाई – आप पितामह हैं समाजवादी पार्टी के. आपके सामने रामपुर में द्रौपदी का चीर हरण हो रहा हैं. आप भीष्म की तरह मौन साधने की गलती मत करिये. @yadavakhilesh Smt.Jaya Bhaduri, Mrs.Dimple Yadav.pic.twitter.com/FNO5fM4Hkc
— Sushma Swaraj (@SushmaSwaraj) April 15, 2019
కాగా, ఈ తరహా దాడులు తనకు కొత్తేమీ కాదని జయప్రద అన్నారు. 2009లో తాను సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తనకు ఎవరూ మద్దతు ఇవ్వకపోగా తనపై వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వాళ్లు ఏమన్నారో కనీసం మళ్లీ చెప్పే పరిస్థితి కూడా ఒక ఆడదానిగా తనకు లేదన్నారు. ఆయనకు తాను ఏం చేశానని ఇలాంటి మాటలు అంటున్నారో తనకు తెలియదని ఆమె చెప్పారు. అయితే, తరచు ఏవో ఒక కేసుల్లో ఇరుక్కుంటూ ఉండే ఆజంఖాన్ మాత్రం తాను జయప్రదను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ ఖండించారు. తాను నేరం చేసినట్లు రుజువైతే ఎన్నికల్లో కూడా పోటీ చేయనని అన్నారు. తాను ఎవరి పేరూ చెప్పి అవమానించలేదని తెలిపారు. తాను తొమ్మిదిసార్లు రాంపుర్ ఎమ్మెల్యేగాను, గతంలో మంత్రిగా కూడా పనిచేశానని, ఏం మాట్లాడాలో తనకు తెలుసని చెప్పారు.