అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 25 రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, ఎర్రబాలెం, వెలగపూడి సహా రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతులు నిరసనను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు. మందడం, తుళ్లూరు, వెలగపూడిలో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. తుళ్లూరు మహాధర్నా కోసం రైతులు టెంట్లు వేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. టెంట్లు వేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మందడం గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఇళ్లలో నుంచి ఎవ్వరు బయటకు రావ్వొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన చోట రైతులు, మహిళలు నిరసన తెలుపుతూ ప్రత్యేక పూజ చేస్తున్నారు.
వెలగపూడిలో టెంట్ వేసేందుకు రైతులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎండలో కూర్చొని రైతుల దీక్ష కొనసాగిస్తున్నారు. తుళ్లూరులో ఓ ప్రైవేటు స్థలంలో కూర్చొని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రావడంతో గేటుకు తాళం వేసి మరీ నిరసన తెలియజేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసులు డ్రోన్ సాయంతో సమీక్షిస్తున్నారు.
రాజధాని ప్రాంతంతోపాటు కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ధర్నాలు, ఆందోళన దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధుల బృందం నేడు రాజధాని గ్రామాల్లో పర్యటించనుంది. తుళ్లూరులో మహిళలపై పోలీసుల దాడి ఆరోపణల నేపథ్యంలో ఘటనపై విచారణ జరపనుంది.
మరోవైపు ఏపీ రాజధానిగా అమరావతినే ఎందుకు కొనసాగించాలనే దానిపై నేడు రాయలసీమలో ఐకాస ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనుంది. తిరుపతిలో జరిగే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విదేశాల్లో ఎన్నారైలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి అధికార వికేంద్రీకరణ కాదు పేరిట ప్రవాసాంధ్రులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.