న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ-సిగరెట్ల ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాలను నిషేధించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ-సిగరెట్ల నిషేధ నిర్ణయంతో కేంద్రానికి లాభం వచ్చింది. పొగాకు వ్యాపారం చేసే రెండు సంస్థల్లో కేంద్రం వాటా కలిగి ఉంది. ఐటీసీ, విఎస్టీ సంస్థలు ప్రభుత్వ అధినంలోనే ఉన్నాయి. కేంద్ర నిర్ణయం తర్వాత పొగాకు సంస్థల వాటా ధరలు పెరిగాయి. దీంతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల లాభాలను నమోదు చేసింది.
కేంద్ర నిర్ణయంతో సంప్రదాయ సిగరేట్ కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. బుధవారం కొన్ని పొగాకు సంస్థల షేర్ ధరలు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో 9 శాతం పెరిగాయి. ఎలక్ట్రానిక్ సిగరేట్ల ఉత్పత్తి, దిగుమతి, పంపిణీ, అమ్మకం నిషేధం నేపథ్యంలో సిగరేట్లు తయారు చేస్తున్న కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేరు 5.55 శాతం, గోల్డెన్ టుబాకో షేరు 4.69 శాతం, వీఎస్టీ షేరు 3.43 శాతం, ఐటీసీ షేరు 1.03 శాతం పెరిగింది.