(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని నదీ పరీవాహక ప్రాంతంలో అర్థరాత్రి 2.36 నిముషాలకు భూమి స్యల్పంగా కంపించింది. ఇంటి పక్కనుంటే పెద్ద ఎత్తున విమానం వెళ్తున్న శబ్దంతో భూ ప్రకంపన రావడంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. సుమారు ఎనిమిది సెకన్ల వరకు భూమి కంపించినట్లు తెలుస్తోంది.
నల్గొండ, సూర్యాపేట, కృష్ణా, గుంటూరు జిల్లా ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయి. కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలోని చిలుకూరు, మునగాల, అనంతగిరి, నడిగూడెం సహా పలు గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ముత్యాల, రావిరాల, మక్కపేట, పెనుగంచిప్రోలు గ్రామాలతో పాటు నందిగామ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
కృష్ణా, మున్నేరు నదీ పరీవాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు సాధారణమే అని జియోలాజికల్ సర్వే అధికారులు తెలుపుతున్నారు. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం గణతంత్ర దినోత్సవం రోజున ఇదే విధంగా భూమి కంపించిందని పలు గ్రామాల ప్రజలు తెలియచేస్తున్నారు.