న్యూఢిల్లీ: తుపాను వచ్చి ముంచితే కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి కనువిప్పు కాలేదు. ప్రచండ తుపాను ఫోని వచ్చి పడుతోందని, దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనీ నాలుగు రోజుల నుంచీ అందరూ మోగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న కమిషన్ ఆఖరికి తుపాను తీరం దాటి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ సడలించింది.
ఫోని ప్రభావానికి గురయిన తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఫోని తుపానుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కమిషన్కు ముందే లేఖ రాశారు. అయితే కమిషన్ దానికి స్పందించలేదు.
మరోపక్క కరవు నివారణ చర్యలు సమీక్షించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తన శాఖ అధికారులతో సమావేశం పెడితే కోడ్ అడ్డం వస్తుందని ఆ అధికారులు డుమ్మా కొట్టారు. మంత్రి తాడోపేడో తేల్చుకుంటాననే సరికి దిగివచ్చారు.
ప్రధాని మోదీకి, పొరుగు రాష్టంలో టిఆర్ఎస్ ముఖ్యమంత్రికి లేని కోడ్ తనకే ఎందుకు అడ్డం వస్తుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఆయన డిమాండ్కు కమిషన్ సమాధానం చెప్పలేదు. దానితో ఆయన తుపాను సహాయకచర్యల సన్నద్ధతపై గురువారం సమీక్ష జరిపారు. ఈ రోజు తుపాను తీరం దాటిన తర్వాత నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.