నీరవ్ విచారణకు పదవీకాలం ముగిసిన అధికారి
మధ్యలోనే వెనక్కి పిలిపిస్తూ ఈడీ ఉత్తర్వులు
మళ్లీ ఉత్తర్వులు రద్దుచేసుకున్న ఈడీ అధిపతి
న్యూఢిల్లీ: అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారట.. అలా ఉంది మన ఈడీ పని. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ స్కాంను విచారించేందుకు లండన్ పంపిన అధికారిని సమయం అయిపోయిందంటూ వెనక్కి పిలిపించారు. ఈడీలో పనిచేయడానికి ఐదేళ్ల పాటు అవకాశం ఉంటుంది. ఆ సర్వీసు అయిపోయినందున లండన్ నుంచి వెనక్కిరావాలని ఆయనకు తెలిపారు. అయితే ఈ విషయం మీడియాలో పొక్కడం, అంత ముఖ్యమైన కేసును మధ్యలో వదిలేస్తే మళ్లీ మరో అధికారి మొదటి నుంచి మొదలుపెట్టాలన్న వాదన రావడంతో ఈడీ నాలుక కరుచుకుంది. దాంతో జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత కుమార్ ను అక్కడే ఉండి కేసు చూసుకోవాలని ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. రూ. 13 వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోదీని తిరిగి భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసుకు సాయం చేసేదుకు ఈడీ అధికారులు లండన్ వెళ్లారు.
అయితే, ముంబైజోన్ జాయింట్ డైరెక్టర్ అయిన సత్యబ్రత కుమార్ ఈడీలో తన ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బొగ్గు స్కాం కేసులు, అదనపు డైరెక్టరుకు కేటాయించిన ఇతర అన్ని కేసులు చూస్తారని.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అలాగే చేయాలని ఈడీ చీఫ్ మిశ్రా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఒక వర్గం మీడియాలో బాగా ప్రచారం అయిపోయింది. నిజంగా ఐదేళ్ల కాలం పూర్తవుతుందంటే, అలాంటి అధికారిని నీరవ్ మోదీ కేసు విచారణకు ఎందుకు పంపారన్న ప్రశ్నలు తలెత్తాయి. దాంతో ఈడీ నాలు కరుచుకుంది. వెంటనే తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ప్రకటన చేశారు. నీరవ్ మోదీ కేసును చూస్తున్న జాయింట్ డైరెక్టరును వెనక్కి రప్పిస్తున్నట్లు మీడియాలో వచ్చిందని, అది నిజం కాదని అందులో తెలిపారు. అయితే ఎన్డీటీవీ సంపాదించిన అంతర్గత ఉత్తర్వుల ప్రకారం.. సత్యబ్రత కుమార్ ను నిజంగానే వెనక్కి రావాలని ఆదేశాలిచ్చారు. కానీ మీడియాలో రావడంతో వాటిని రద్దుచేశారు.
సాధారణంగా ఎవరైనా అధికారి పదవీకాలం ముగుస్తూ, దాన్ని పొడిగించాలంటే ఆరునెలల ముందు నుంచే పని మొదలవుతుంది. పొడిగింపు ఉత్తర్వులు కూడా పదవీకాలం ముగిసేలోపే ఇవ్వాలి. అలా పొడిగించడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సహా పలు రకాల అధికారుల నుంచి అనుమతులు అవసరం అవుతాయని తన పేరు బయట పెట్టొద్దని కోరిన ఈడీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.