Photo Credit: The Scientist Magazine
నూతన పత్తి వంగడాన్ని రూపొందించిన శాస్త్రవేత్తల బృందం సభ్యులు కీర్తి రాథోడ్, దేవేంద్ర పాండ్యా, లీయానీ కాంప్బెల్
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : అమెరికా శాస్త్రవేత్తలు కొత్త రకం పత్తి వంగడం రూపొందించారు. అందుకు జన్యు మార్పిడి సాంకేతికతను ఉపయోగించారు. ఈ వంగడం చలామణీకి, ఆహార వినియోగానికీ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. ఈ వంగడం పండించడం ద్వారా పత్తికి పత్తీ వస్తుంది. ఆపైన తినడానికి పనికొచ్చే విత్తనాలూ లభిస్తాయి.
పత్తి పంట గురించి మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పత్తి నుంచి వచ్చే దూదితో కాటన్ బట్టలు తయారవుతాయన్న సంగతి అందరికీ తెలుసు. మరి దూదిని వేరు చేసిన తర్వాత మిగిలే పత్తి గింజలు ఏం చేస్తారు. ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం అందరికీ తెలియకపోవచ్చు. పత్తి గింజలలో గాసిపోల్ అనే విషపదార్ధం ఉంటుంది. అందువలన ఆ గింజలు – వాటిలో మాంసకృత్తులు దండిగా ఉన్నప్పటికీ – మనుషులు కానీ జంతువులు కానీ తినేందుకు పనికిరావు. పత్తి గింజల నుంచి నూనె తీస్తారు. దానిని శుద్ధి చేసి అందులో ఉండే గాసిపోల్ను తొలగిస్తారు. అలా శుద్ధి చేసిన నూనెను ఆహార పరిశ్రమలలో వాడతారు.
ఇప్పుడు అమెరికాలో రూపొందిన రకంలో జన్యుమార్పిడి సాంకేతికత ద్వారా పత్తి గింజలో అసలు గాసిపోల్ అన్న పదార్ధమే లేకుండా చేశారు. మొక్క ఇతర భాగాలలో మాత్రం గాసిపోల్ తగినంత ఉండేలా చూశారు. ఎందుకంటే అది చీడపీడల నుంచి మొక్కను రక్షిస్తుంది.
ఈ వంగడం విత్తనాల రుచి కొంతవరకూ సెనగలను పోలి ఉంటుంది. వీటిలో మాంసకృత్తులు దండిగా ఉంటాయి కాబట్టి ఈ పంట పెంపకం ద్వారా పేద దేశాలలో పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చని భావిస్తున్నారు.
టెక్సాస్లోని ఎ&ఎమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వంగడం రూపొందించారు. విత్తనాల కంపెనీలతో చర్చలు నడుస్తున్నాయనీ, మరో అయిదేళ్లలో వాణిజ్య స్థాయిలో పంట సాధ్యమవుతుందనీ ఎ&ఎమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కీర్తీ రాథోడ్ పేర్కొన్నారు. మెక్సికోతో మొదలుపెట్టి ఇతర దేశాల అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. జన్యుమార్పిడి పంటల పట్ల చాలా ప్రపంచ దేశాలలో అనుమానాలు ఉన్న మాట వాస్తవమేననీ, అయితే పౌష్టికాహారం కొరత ఉన్న దేశాలు ఈ పంటను స్వీకరిస్తాయన్న ఆశ ఉందనీ కీర్తి పేర్కొన్నారు.