అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలు సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. ఈవిఎంలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈవిఎంలలో లోపాలపై టిడిపి లేవనెత్తిన సందేహాలపై చర్చకు సిద్ధమన్న ఎన్నికల కమిషన్ ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక నిపుణుడు వేమూరు హరి ప్రసాద్ ఉండటాన్ని తప్పు పట్టింది. ఆయనపై ఈవిఎం చోరీ కేసు ఉందనీ, అందుకే ఆయనతో చర్చించేందుకు ఎన్నికల కమిషన్ నిరాకరించింది. కేసు ఉన్నప్పటికీ పలు మార్లు హరి ప్రసాద్ సేవలను వినియోగించుకున్న ఎన్నికల కమిషన్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించటం సందేహాత్మకంగా నిలిచింది.
ఎన్నికల కమిషన్ తీరుపై చంద్రబాబు న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. వివిఫ్యాట్ స్లిప్పుల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని మరో మరు చంద్రబాబు సహా 21 పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నాయి. 50 శాతం వివిప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఆదేశాలివ్వాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎన్నికల నిర్వహణా లోపాలపై ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని వామపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఈ విషయంలో చంద్రబాబుకు తన మద్దతు తెలిపారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్లు భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదన్నారు.
కేఏ పాల్ ఏకంగా ఈవిఎంలలోని చిప్నే మార్చేశారని ఆరోపించారు. వైసిపికి అనుకూలంగా ఓట్లు పడేలా ఈవిఎంలను టాంపరింగ్ చేశారని పాల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేఏ పాల్ నేడు ఎన్నికల కమిషన్ను కలవనున్నారు.
మరోవైపు వైసిపి నేతలు కూడా నేటి సాయంత్రం ఎన్నికల కమిషన్ ను కలవనున్నారు. వైసిపి ప్రధానంగా ఈవిఎంల భద్రతపై సందేహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు సహకరించే పరిస్థితి లేదనీ, స్ట్రాంగ్ రూమ్ల వద్ద రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనీ వైసిపి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నది. అలాగే తమ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వైసిపి నేతలు ఎన్నికల కమిషన్కు వివరించనున్నారు.
మొత్తానికి రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఎన్నికల కమిషన్ను కలిసేందుకు క్యూ కట్టటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు రాకముందే చంద్రబాబు ఈవిఎంలపై ఆరోపణలు చేయటంపై వైసిపి ఓటమి భయమేమో అని సెటైర్లు వేస్తున్నది. వైసిపి ఈవిఎంలపై ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని టిడిపి అనుమానం వ్యక్తం చేస్తున్నది. ప్రధాన పార్టీల ఆరోపణలతో ప్రజలలో పలు సందేహాలు నెలకొన్నాయి.