న్యూఢిల్లీ: బీజేపీకి చెందిన నమోటీవీ కూడా తప్పనిసరిగా ప్రతి దశ పోలింగుకు 48 గంటల ముందు ‘ఎన్నికల మౌనం’ పాటించాల్సిందేనని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేసింది. అలాగే, నమో టీవీలో వచ్చే కార్యక్రమాలు, ప్రకటనలను గుర్తించి, వాటి ఖర్చును ఆయా పార్టీలు లేదా అభ్యర్థుల ఖాతాల్లో వేయాలని కూడా ఢిల్లీ సీఈవోకు ఈసీ తెలిపింది. రెండోదశ ఎన్నికలు గురువారం జరగనుండటంతో మంగళవారం సాయంత్రం నుంచి ప్రచారాలు ఆపేయాల్సిన సమయం వచ్చింది.
ఎన్నికల కమిషన్ నుంచి సూచనలు వచ్చిన వెంటనే ఢిల్లీ సీఈవో కార్యాలయం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఒక సూచన వెళ్లింది. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 126(1)(బి)ని తప్పక పాటించాలని అందులో సూచించారు. ఎన్నికలు ముగిసేందుకు 48 గంటల ముందు నుంచి సినిమాలు, టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాలలో ఎన్నికలకు సంబంధించిన అంశాలను చూపించకూడదని ఆ చట్టంలో ఉంది. ఏప్రిల్ 11వ తేదీన తొలిదశ పోలింగ్ సమయానికి ముందు 48 గంటలలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాలు, ఇతర రాజకీయ కార్యక్రమాలను నమోటీవీలో ప్రసారం చేయడంతో ఈసీ ఈ ఉత్తర్వులిచ్చింది.