న్యూఢిల్లీ: వివి ప్యాట్ల లెక్కింపు విషయంలో విపక్షాలకు మరోసారి ఎదురుదెబ్బతగిలింది. ఓట్ల లెక్కింపు సమయంలో ముందుగా వివి ప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదనీ, వివి ప్యాట్లను ముందుగా లెక్కించడం కుదరదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఓట్ల లెక్కింపు సమయంలో వివి ప్యాట్లను ముందుగా లెక్కించాలనీ, ఆ సమయంలో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా ఆ నియోజకవర్గంలోని మొత్తం వివిప్యాట్లను లెక్కించేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు మంగళవారం ఎన్నికల సంఘాన్ని కలిసి 11పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఢిల్లీ, రాజస్థాన్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, అశోక్ గెహ్లాట్ల నేతృత్వంలో నిన్న వినతి పత్రం అందజేయగా, నేడు సమావేశమైన ఎన్నికల సంఘం విపక్షాల డిమాండ్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.