(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటోందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కార్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు-మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం హిందూ పత్రికలో రాసిన ఓ కథనంలో వెల్లడించారు.
టీడీపీ హయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరకాల ప్రభాకర్ సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం నెహ్రూ ఆర్థిక విధానాలను విమర్శించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. అధికార పార్టీ చర్య ఆర్థిక విమర్శగా లేదని, రాజకీయ దాడిగానే మిగిలిపోయిందన్నారు. ఆ విషయాన్ని బీజేపీ ఇంకా గుర్తించడం లేదని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తన కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖత చూపడంలేదని పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా కూడా ప్రభుత్వం ఇంకా తిరస్కరణ ధోరణిలోనే వెళ్తోందన్నారు. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని, దేశంలో ఒక రంగం తర్వాత మరో రంగానికి సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని వాస్తవిక పరిస్థితులను అంగీకరించడం లేదని, ఇదే అసలు సమస్యకు కారణమని తెలిపారు. ‘బీజేపీ పొలిటికల్ ప్రాజెక్ట్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఓ యోధునిగా ఎలా ఉన్నారో.. అలాగే దేశ ఆర్ధిక సంస్కరణల్లో పీవీ కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. బీజేపీలోని మేధావి వర్గం ఎంతసేపూ విమర్శలు చేస్తున్నంత మాత్రాన.. అవి ఎకానమీ పురోగమనానికి దారి తీస్తాయా అని పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు.
ఇదిఇలా ఉంటే.. పరకాల ప్రభాకర్ ఆర్టికల్ గురించి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించినప్పుడు.. 2014 -19 మధ్య తాము ప్రాథమిక సంస్కరణలు చేశామని చెప్పారు. జీఎస్టీ, ఆధార్, వంట గ్యాస్ పంపిణీ వంటి పథకాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని వివరించారు. ఆర్ధిక వృద్ద్ధిరేటును పెంచేందుకు కేంద్రం ఇప్పటికే కార్పొరేట్ పన్నును తగ్గించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి గుర్తింపు పొందారు. పీవీ నరసింహారావు.. మన్మోహన్ సాయంతో 1991లో సరళీకృత విధానాలతో సంస్కరణలను నడిపించారు. నిజానికి ప్రధానిగా ఉన్న సమయంలో కంటే.. ఆర్థికమంత్రిగా ఉన్నపుడే మన్మోహన్ ఎక్కువ ఆర్థిక సంస్కరణలు చేయగలిగారు. భారత్లో 1991 నుంచి ప్రారంభమైన ఆర్థికాభివృద్ధి వేగాన్ని గమనిస్తే 1991 నుంచి 2010 వరకూ వృద్ధి రేటు ప్రపంచంలోని మిగతా దేశాల కంటే ఒక విధంగా మెరుగ్గానే ఉండేది. అటు ఆర్థికవృద్ధి ఈ నిర్మాణమే భారత్లో టాక్స్ పరిధిలోకి రాని వర్గాల్లో కూడా ఊపిరిలూదింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన కార్మిక వర్గాలు, పూర్తిగా అసంఘటిత రంగంలో ఉన్నవారి పని, వేతనాలు జీడీపీ గ్రోత్ను పెంచడానికి సాయం చేశాయి.