న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ స్వామి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన 23 ఏళ్ల న్యాయ విద్యార్థిని.. వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టంది. తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యంగా ఉన్న ఓ పెన్ డ్రైవ్ను పోలీసులకు అందజేసింది. దాదాపు 15 గంటలపాటు విద్యార్థినిని విచారణ జరిపిన అనంతరం సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు తన స్నేహితురాలి ద్వారా అందజేసింది. ఏడాది పాటు తనపై అత్యాచారం జరిపిన సమయంలో తన కళ్లజోడులోని కెమెరాతో రికార్డు చేసింది. ఆ వీడియోను ఇప్పుడు బయటపెట్టింది.
మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో చిన్మయానంద్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత ఏడాది జూన్లో షాహజాన్పూర్ కాలేజీలో చేరే ముందు చిన్మయానంద్ను కలిశానని న్యాయ విద్యార్థిని తెలిపింది. అప్పుడే ఆయన తన ఫోన్ నంబర్ తీసుకున్నాడని.. కాలేజీ లైబ్రరీలో రూ.5 వేల ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పారని ఆమె పేర్కొంది. ఆ తర్వాత హాస్టల్లో ఉండాలని సూచించడంతో అక్కడ ఉన్నానని తెలిపింది. అయితే, హాస్టల్లో తాను స్నానం చేస్తున్న వీడియోను రికార్డు చేసి దాంతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారని ఆమె తెలిపింది. అదే తరహాలో తాను సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో తన కళ్లజోడులో ఓ కెమెరాను పెట్టి.. దాని సహాయంతో వీడియో రికార్డు చేసింది.
ఫేస్బుక్లో నేత పేరు చెప్పకుండా ఆరోపణలు చేసిన విద్యార్థిని.. తర్వాత వారం రోజుల పాటు కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. రాజస్థాన్ లో ఆమెను గుర్తించారు. అనంతరం ఆమెను సుప్రీం కోర్టు ముందు సాక్ష్యాలతో పాటు ఫిర్యాదు ఉంచడంతో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది.