రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో పోలీసులు అమిత్ జోగిని మంగళవారం అరెస్ట్ చేశారు. . ఎస్టీలకు రిజర్వ్డ్ అయిన మార్వాహి నియోజకవర్గం నుంచి 2013లో పోటీ చేసిన అమిత్ జోగి.. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ బీజేపీ నేత సమీర పాక్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2018, ఫిబ్రవరి 3న అమిత్ జోగిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ పోలీసులు జోగిని అరెస్టు చేశారు. అమిత్ జోగిని బిలాస్పూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన ప్రదేశం గురించి కూడా ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా పేర్కొన్నారనే ఆరోపణలున్నాయి.
జోగి 1977లో టెక్సాస్లో జన్మిస్తే.. అఫిడవిట్లో మాత్రం 1978లో ఛత్తీస్గఢ్లోని గౌరీలా గ్రామంలో జన్మించినట్లు పేర్కొన్నట్లు సమీరా తన ఫిర్యాదులో పేర్కొంది. ఇదిఇలా ఉంటే.. ఇటీవల అమిత్ జోగి తండ్రి, ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ ఎస్టీ కాదంటూ తేల్చిన సంగతి తెలిసిందే. తప్పుడు ధృవీకరణ పత్రం సృష్టించినందుకు అజిత్ జోగీపైనా కేసు నమోదు చేశారు.