అమరావతి: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడి. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాలమైన రాయలసీమకి కూడా ఈ నానుడి వర్తిస్తోంది.
కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్లు గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఒకే పార్టీలో ఉన్నా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. అదే మారిదిగా టిడిపి సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాల కాలంగా వైరం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు టిడిపి అధినేత చంద్రబాబు టికెట్ల పంచాయతీ సమయంలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. రామసుబ్బారెడ్డికి అసెంబ్లీ టికెట్,ఆదినారాయణ రెడ్డికి కడప పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. రాష్ట్రంలో వీచిన ఫ్యాన్ గాలికి ఇద్దరు నేతలు ఓటమి పాలైయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతూ వస్తున్నాయి. ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయంతో కరుడుగట్టిన పలువురు టిడిపి నేతలు సైతం పార్టీకి గుడ్బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరిపోతూ వస్తున్నారు. కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. అదే జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఎడమొహం పెడమోహంగా ఉన్న ఈ ఇద్దరు నేతలు మళ్లీ ఒకే పార్టీ వేదికను పంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
2014 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరడంతో చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఆదినారాయణరెడ్డి సమయం వచ్చినప్పుడల్లా నాటి వైసిపి అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ వరంగా, వ్యక్తిగతంగానూ జగన్ను ఆది తూలనాడారు. ఎన్నికల తరువాత పరిస్థితులు మారిపోయాయి. జగన్మోహనరెడ్డి సిఎం అయ్యారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో తన వర్గీయులను కాపాడుకునేందుకు ఆదినారాయణరెడ్డి ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆదినారాయణరెడ్డి ఇటీవల బిజెపి నేతలతో మంతనాలు జరిపారు. పార్టీ అధిష్టానం నుండి ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ రావడంతో నిన్న రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అపాయింట్మెంట్ లభించిందని తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి ఈ రోజు రేపో తన వర్గీయులతో కాషాయ కండువా కప్పుకోనున్నారు. టిడిపిని వీడుతున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబుకు ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే చెప్పినట్లు సమాచారం.