న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరంను బుధవారం రాత్రి సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు.
చిదంబరం నివాసం వద్ద సిబిఐ అధికారులు లోపలికి రాకుండా అడ్డుకునేందుకు అయన వ్యక్తిగత సిబ్బంది గేట్లు వేయగా, అధికారులు గోడ దూకి మరీ లోపలికి వెళ్లి చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని అదుపులో తీసుకొనేందుకు సిబిఐ, ఈడి అధికారులు నిన్న రాత్రి నుండి అయన నివాసం చుట్టూ తిరిగిన విషయం తెలిసిందే.
గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఢిల్లీ హైకోర్టు లో అయన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. హైకోర్టు తీర్పుపై అయన తరుపున న్యాయవాదులు బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లభించలేదు. స్పెషల్ లీవ్ పిటిషన్ ను శుక్రవారం విచారిస్తామని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తెలిపారు.
చిదంబరం అదృశ్యంఫై బిజెపి నేతలు విమర్శిస్తున్న తరుణంలో అనూహ్యంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో అయన ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఏ నేరము చేయలేదనీ, ఎఫ్ ఐ అర్ నమోదు చేసినంతమాత్రాన నేరస్తుడిగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మీడియా సమావేశం అనంతరం జోర్ బాగ్ లోని అయన నివాసానికి వెళ్లిన కొద్దిసేపటి సిబిఐ, ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసుల సహకారంతో అయన ఇంటికి చేరుకున్నారు.చిదంబరం వ్యక్తిగత సిబ్బంది గేటు వేయగా అధికారులు గోడ దూకి లోపలికి ప్రవేశించి చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆయన్ను కారులో సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
గోడ దూకి లోపలికి వెళ్తున్న సిబిఐ అధికారులు వీడియో ani సౌజన్యంతో…