న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది.
ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పుపై చిదంబరం న్యాయవాదులు బుధవారం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా దానిని లిస్టింగ్ కోసం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచాలని జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
ఈ పిటిషన్పై నేడు వాదనలు వినలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తెలిపారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరపనున్నారు. కాగా దీనిపై చిదంబరం న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
చిదంబరంను అదుపులోకి తీసుకొని విచారించేందుకు ఇడి, సిబిఐ అధికారులు ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన దేశం వదిలి విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసు కూడా జారీ చేశారు.
మరో పక్క ఏఐసిసి నాయకులు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ, డిఎంకె నేత స్టాలిన్ తదితర నేతలు మాజీ మంత్రి చిదంబరంపై బిజెపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందనీ, ఇడి, సిబిఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదనీ విమర్శించారు. చిదంబరంకు అండగా ఉంటామని వారు పేర్కొన్నారు.