(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విశాఖపట్నం: వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనా దృక్పథం అవలంబిస్తే మంచిదని టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వాల్తేర్ క్లబ్పై అధికార పార్టీ నేతల కళ్లు పడ్డాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయన వాల్తేరు క్లబ్ ప్రాముఖ్యతను వివరించారు.
వైజాగ్కి ప్రాచీన నామం అయిన వాల్తేరు పేరుతో 1883 లో ప్రారంభం అయినప్పటినుంచి ఈ క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమై వైజాగ్ బ్రాండ్లో భాగమైందని ఆయన పేర్కొన్నారు.
అందరికీ ఆహ్లాదాన్ని, ఆతిధ్యాన్ని ఇచ్చే మచ్చికైన ప్రాంతం కావడంతో దీనితో అనుబంధం పెరిగిందనీ, ఇందులో ఎందరో విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, దేశభక్తులు, వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన నిపుణులు, దేశ విదేశాలలో తమ తమ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వారు చాలా మంది సభ్యులుగా ఉన్నారని వివరించారు.
ఈ సున్నితత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం దీనిని యధాతధంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే… వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి, కృషి చేస్తుందని విశ్వసిస్తున్నానని గంటా వ్యాఖ్యానించారు.