(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్కు ఆ పార్టీ నేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఊహించని షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. వారిని గెలిపించాలని ప్రచారం చేయడం టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కొల్లాపూర్లో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి, మాజీ మంత్రి జూపల్లికి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొల్లాపూర్లో రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయి, రెబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో అక్కడ టీఆర్ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక, వారికి బీఫామ్లు ఇచ్చే బాధ్యతను పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకే అప్పగించారు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జూపల్లి కృష్ణారావు… తన వర్గం వారిని కొల్లాపూర్లోని మొత్తం 20 వార్డుల్లో పోటీ పెట్టారు. వారందరినీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున సింహం గుర్తుపై పోటీకి నిలబెట్టారు. పట్టణంలో సింహం గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. జూపల్లి తీరుపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి… ఆయనపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. జూపల్లి తన వర్గీయులైన 20 మంది రెబెల్స్ తరపున ప్రచారం చేస్తున్న ఫోటోలు, వీడియోలను కేటీఆర్కు పంపారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలోని ప్రజలను సింహం గుర్తుకు ఓటేయాలని, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా జూపల్లి ప్రచారం చేస్తున్నట్లు పార్టీ నేత హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదులో ఆరోపించారు.
కొల్లాపూర్లో ఉన్న 20 వార్డులకు సైతం జూపల్లి తన వర్గీయులతో నామినేషన్ వేయించారని గురువారం(జనవరి 16) తెలంగాణ భవన్లో టెలీకాన్ఫెరెన్స్ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి కేటీఆర్కు చెప్పారు. తన వర్గం వారిని నామినేషన్లు ఉపసంహరించేలా కొద్ది రోజుల క్రితం కేటీఆర్ జూపల్లికి చెప్పినా ఆయన వినలేదని నేతలు ఆరోపిస్తున్నారు. అందరినీ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయాలని బహిరంగంగా కొల్లాపూర్ వీధుల్లో తిరుగుతున్నారని చెప్పారు.
వాస్తవానికి గతంలోనే దీనిపై కేటీఆర్కు హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేయగా… రెబల్స్ను బరి నుంచి తప్పించాలని మంత్రి కేటీఆర్ జూపల్లిని కోరారు. అయితే నామినేషన్లు ఉపసంహరణ సమయానికి వారితో విత్ డ్రా చేయిస్తానని చెప్పిన జూపల్లి… వారంతా పోటీలో ఉండేలా చేయడం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఆర్ఎస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని జూపల్లి కృష్ణారావు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తీవ్రంగా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న జూపల్లి.. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో ఆపార్టీ నుంచి గెలిచి.. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకర్గంలో జూపల్లికి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి మధ్య ఆదిపత్య పోరు కూడా నడుస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇవ్వకపోడంతో వారందరినీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున రెబల్స్ గా బరిలో దింపినట్లు తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై జిల్లాలోని పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.