అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలతో ఫాసిస్టు పాలన చేస్తోందని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని యనమల దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పోయి, ఫాసిస్ట్ ఫ్రభుత్వం వచ్చిందని యనమల అన్నారు. రాష్టాభివృద్ది, పేదల సంక్షేమం కోసం టిడిపి ప్రభుత్వం పని చేసిందని ఆయన అన్నారు. అభివృద్దిని దెబ్బతీసేలా, సంక్షేమాన్ని కుంటుపరిచేలా వైసిపి ప్రభుత్వం పని చేస్తోందని యనమల విమర్శించారు.
ప్రతిపక్షాల మీద దాడులు చేయడమే వైసిపి ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా ఉందని యనమల అన్నారు.‘స్లోగన్స్ సర్ ప్లస్’(నినాదాలు పుష్కలం)…‘ఫంక్షన్స్ డెఫిసిట్’(నిర్వహణ అధ్వానం)గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు ఉందని యనమల పేర్కొన్నారు. అన్నం అంతా చూడాల్సిన పనిలేదు, మెతుకు పట్టుకుంటే తెలిసి పోతుందని యనమల చెప్పారు. నెల రోజుల్లోనే వైసిపి ప్రభుత్వ అసమర్ధత, అరాచకం బైటపడిందని యనమల అన్నారు. ‘ఈ ఖరీఫ్ లో తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితి ఉంది. అలాంటిది కరువు నివారణ చర్యలపై కసరత్తే లేదు’ అని యనమల అన్నారు. విత్తనాలు అందక రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే కనీసం విత్తన పంపిణీపై యాక్షన్ ప్లాన్ రూపొందించ లేదని యనమల ఆరోపించారు.
‘ఎదుటివాళ్ల ఇళ్లు ఎలాకూలగొట్టాలి, పేదల ఇళ్లు ఎలా కూల్చాలి అనే దానిపైనే ఈ ప్రభుత్వం దృష్టి ఉంది’ అని యనమల ఎద్దేవా చేశారు. ఇది కూల్చే ప్రభుత్వమే తప్ప కాపు కాసే ప్రభుత్వం కాదని యనమల విమర్శించారు. ఆ విషయం రైతులు, మహిళలు, పేదలకు అర్ధం అయ్యిందని యమనల అన్నారు.
‘రాష్టంలో అభివృద్ది అంతా ఆగిపోయింది. పోలవరం పనులు నిలిచిపోయాయి. మళ్లా ఎప్పుడు మొదలెడతారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది’ అని యనమల పేర్కొన్నారు.‘గోదావరిలో నీళ్లు లేవు, పట్టిసీమకు నీళ్లు ఆపేశారు. ఏపి గురించి గాలికి వదిలేసి తెలంగాణ వెంటపడి తిరుగుతున్నారు’ అని ఆయన విమర్శించారు. ‘ఈ ఏడాది వ్యవసాయ ఉత్పాదకత ఎంత ఉంటుందో ఊహించ లేకపోతున్నాం. అది జిఎస్డిపిపై తీవ్ర ప్రభావం చూపనుంది. వృద్దిరేటు సింగిల్ డిజిట్కు పడిపోయే ప్రమాదం ఉంది’ అని యనమల అన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు రాజకీయ కక్ష సాధింపులతో కాలం వెళ్లబుచ్చుతారా అని యనమల ప్రశ్నించారు. ‘కమిటిల పేరుతో రాజధాని నగర నిర్మాణ పనులు ఆపేశారు. ఉంచుతారా లేక ఊడగొడతారా అనే అనుమానాలు రాజధాని ప్రజల్లో ఉన్నాయి. రాష్ట్రం అంతటా అనిశ్చిత పరిస్థితి కల్పించారు. భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లబోతోంది.
పయనీర్ స్టేట్ గా మోది ప్రశంసలు పొందిన ఏపిని అట్టడుగు స్థాయికి తీసుకెళ్తారా’ అని యనమల ప్రశ్నించారు. సోషలిజం తెస్తానని అధికారంలోకి వచ్చిన ముస్సోలిని ఫాసిస్టుగా మారాడని యనమల అన్నారు. పేదలకు మేలు చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫాసిస్ట్ గా మారిందని యనమల విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిదే కీలక భూమిక అని యనమల అన్నారు. పేదల సమస్యలపై ప్రతిపక్షంగా పోరాటం చేయడం తమ విధి అని యనమల అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే సత్తా టిడిపికి ఉందని యనమల పేర్కొన్నారు.